శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

హైదరాబాద్‌లో కరోనా వైరస్.. హైఅలెర్ట్‌లో తెలంగాణ సర్కారు..

ఢిల్లీ, తెలంగాణలో ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్‌ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ రమేశ్‌ రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌.. ఐసోలేషన్‌ వార్డు వైద్యులతో సమావేశమయ్యారు. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. 
 
ఆ తర్వాత రమేశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైందని తెలిపారు. సదరు వ్యక్తి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇక రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆరోగ్య శాఖ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
 
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి.. దుబాయి నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అతని బంధువుల ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు, డాక్టర్లు. ఇక ఇటీవలే బ్యాంకాక్‌ నుంచి ఓ సామాజిక కార్యకర్త హైదరాబాద్‌కు వచ్చాడు. అతనికి తీవ్రమైన దగ్గు ఉండడంతో.. గాంధీలో చికిత్స అందిస్తున్నారు. భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య -5. 
 
నేడు ఉన్నత స్థాయి సమీక్ష 
ఇదిలావుంటే, హైదరాబాద్‌లో తొలి కరోనా వైరస్‌ కేసు నమోదైన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో మంత్రులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. పురపాలక, పంచాయతీ రాజ్‌, విద్య, వైద్య శాఖ, రవాణా, పోలీస్‌, రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులతో మంత్రులు సమీక్షించనున్నారు. 
 
ఆయా శాఖల అధికారులు, శాఖాధిపతులు ఈ సమీక్షలో పాల్గొననున్నారు. ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షాసమావేశంలో మంత్రులు చర్చించనున్నారు. కరోనా పాజిటివ్‌ గా తేలిన యువకుడికి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్సనందిస్తున్నామని, ప్రస్తుతం బాధిత వ్యక్తి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.