శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 మార్చి 2020 (07:34 IST)

మోడీ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాకు దూరంగా...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆయన ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవడానికి గల కారణాలను మాత్రం తెలియలేదు. 
 
నిజానికి ప్రధాని నరేంద్ర మోడీకి సోషల్ మీడియాలో అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న నేతల్లో ఆయన కూడా ఒకరు. అలాంటి మోడీ... ఈ ఆదివారం నుంచి తాను సోషల్ మీడియా అకౌంట్లకు దూరంగా ఉండాలని భావించినట్టు తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. 
 
ట్విట్టర్‌తో ఫాటు.. ఇతర సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను, కానీ మీరందరూ పోస్టులు చేస్తుండాలి అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనదైనశైలిలో స్పందించారు. వదిలేయాల్సింది సోషల్ మీడియాను కాదని, విద్వేషాన్ని వదిలేయాలని రాహుల్ హితవు పలికారు. అటు, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ప్రధాని నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు. 
 
మన ప్రధాని నరేంద్ర మోడీ అకౌంట్‌ను ఎవరూ హ్యాక్ చేయలేదు కదా! అంటూ చమత్కరించారు. లేకపోతే, డిజిటల్ మాలిన్యాలను తొలగించే సున్నితమైన ప్రక్రియ గురించి ఏమైనా సంకేతాలు ఇస్తున్నారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. మొత్తంమీద ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం ఇపుడు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.