శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: సోమవారం, 28 సెప్టెంబరు 2020 (19:37 IST)

విద్యుత్ బిల్లింగ్ విషయంలో అసత్య ప్రచారాలు నమ్మొద్దు, CMD రఘుమారెడ్డి

విద్యుత్ శాఖ ఉద్యోగులు 30రోజులకు బిల్ తీయాలి. కానీ 30 రోజుల తరువాత 31 నుండి 40 రోజులవరకు బిల్లులు కొట్టి  ఇస్తున్నారు. దీనివల్ల వినియోగదారులపై అధిక భారం పడుతున్నది" అని వివిధ సామాజిక మాధ్యమాల్లో కొంత మంది పోస్టింగులు పెట్టి విద్యుత్ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే విషయం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ దృష్టికి వచ్చింది.
 
 
విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశానుసారం, నెలవారీ విద్యుత్ వాడకం బిల్లులు తీయడంలో కొన్ని రోజులు ఆలస్యం అయినా కూడా ఖచ్చితమైన విద్యుత్ బిల్లులు జారీ చేసేలా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ తగు శాస్త్రీయ/ప్రామాణిక పద్దతిని అవలంబిస్తున్నది. 
 
ఉదాహరణకు ఒక విద్యుత్ సర్వీసుకు 32 రోజులకు రీడింగ్ నమోదు చేయడం వలన 106 యూనిట్లు వాడకం జరిగింది అనుకుందాం. ఇలాంటి బిల్లులను క్రింది విధంగా 30 రోజలకు లెక్కించి బిల్లు జారీ చేస్తారు
 
30 రోజులకు విద్యుత్ వాడకం = వాడిన మొత్తం యూనిట్లు/రీడింగ్ నమోదు చేసిన రోజులు x 30 రోజులు (106/32 x 30 = 99 యూనిట్లు) అనగా కేటగిరీ 1A (నెలసరి విద్యుత్తు వాడకం 100 యూనిట్లు లోబడి ఉంటే) ప్రకారం మొదటి స్లాబ్‌లో 53 (50/30 x 32) Rs.1.45/యూనిట్‌కు ఛార్జ్ చేస్తారు రెండొవ స్లాబ్‌లో 53 (50 / 30 x 32) Rs. 2.60/యూనిట్‌కు ఛార్జ్ చేస్తారు.
 
ఈ విధంగా లెక్కించటం వలన విద్యుత్ వాడకంలో ఆలస్యం జరిగినా కూడా వినియోగదారుడికి ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు విద్యుత్ రీడింగ్ నమోదు చేసే మెషిన్లో సాఫ్ట్వెర్‌ను పొందుపరచటం జరిగింది. 
 
తెలంగాణ రాష్ట్రములో 1.56 కోట్ల మంది విద్యుత్  వినియోగదారులు వున్నారు. అందరికి సకాలంలో విద్యుత్ వాడకం బిల్లులు 30 రోజులకు జారీ చేసే విధంగా పంపిణి సంస్థలు అన్ని ఏర్పాట్లు తీసుకున్నాయి.
 
కొంత మంది తమ అవగాహన లోపం వల్ల అసత్య సమాచారాన్ని వివిధ సామాజిక మాధ్యమాల్లో పొందుపరుస్తున్నారు. వినియోగదారులు ఇలాంటి అసత్య సమాచారాన్ని నమ్మొద్దని, తమకు జారీ చేసే బిల్లులో ఏవైనా సందేహాలు ఉంటే సమీప విద్యుత్ కార్యాలయం లోని అధికారులను సంప్రదించగలరని సంస్థ చైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి తెలియజేసారు.