1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Updated : ఆదివారం, 14 జూన్ 2020 (15:50 IST)

వైద్యుల నిర్లక్ష్యం... ప్రాణాలు కోల్పోయిన డ్రైవరు

వైద్యుల నిర్లక్ష్యం మూలంగా ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే అతను చనిపోయినట్లు వారి కుటుంబ సభ్యులు బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. 
 
బొల్లారంలో నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ అనే వ్యక్తి డ్రైవరుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తనకి కడుపులో నొప్పి ఉండడంతో కడుపు నొప్పి మరింత తీవ్రం కావడంతో అతను ఓల్డ్ అల్వాల్‌లోని ఎక్సెల్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. 
 
ఈ నెల ఆరవ తేదీన అతను ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు అతన్ని పరీక్షించిన అనంతరం కడుపులో చిన్న గడ్డ ఏర్పడిందని దాన్ని తొలగించాలని చెప్పడంతో వారు ఆపరేషన్ చేయించారు. సర్జరీ సజావుగా సాగిన తర్వాత ఆరోగ్యం కుదుట పడిన అనంతరం 11వ తేదీన అతను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
గత రెండు రోజుల క్రితం అతనికి కడుపులో నుండి రక్తం రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు తిరిగి వైద్యులను సంప్రదించగా హిమాయత్ నగరులోని తమ ఆస్పత్రికి రావాలని సూచించారు. ఆస్పత్రిలో వైద్యులు అతని ఆరోగ్య స్థితిని పరిశీలించి కడుపులో నీరు చేరిందని తీయాలని చెప్పి, మరోమారు ఆపరేషన్ చేశారు. 
 
దీంతో అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా దిగజారి ముక్కులో నుండి రక్తం రావడం, లోపల పేగులు పూర్తిగా చితికిపోవడంతో అతను కోమాలోకి వెళ్ళాడు అని వారు తెలిపారు. శనివారం రాత్రి సమయంలో అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే అతను చనిపోయినట్లు తెలిపారు.