గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (13:41 IST)

అచ్చెన్నాయుడు ఆరోగ్యం ఎలా వుంది... జీజీహెచ్ వైద్యులు ఏమంటున్నారు?

ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టు అయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పైగా, అరెస్టుకు ముందు అచ్చెన్నాయుడు పైల్స్ ఆపరేషన్ చేయించుకునివున్నారు. అరెస్టు తర్వాత ఆయనను ఏసీబీ అధికారులు సుధీర్ఘ ప్రయాణం చేయించారు. దీంతో ఆయన గాయం తిరిగి పచ్చిగా మారింది. 
 
దీనిపై గుంటూరు జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాకర్ స్పందించారు. అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన అనంతరం అధికారులతో కలిసి ఆయన సుదీర్ఘ ప్రయాణం చేయడంతో ఆయనకు గతంలో జరిగిన ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందన్నారు. ఈ గాయానికి చికిత్స అందిస్తున్నామన్నారు. 
 
పైగా, ఆయనకు అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామన్నారు. ఆయనకైన గాయం తగ్గడానికి 3 రోజులు పట్టవచ్చన్నారు. బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులనే కొనసాగిస్తున్నామన్నారు. అలాగే ఆయనకు షుగర్ లెవల్స్‌ సాధారణంగానే ఉన్నాయని చెప్పారు.
 
మెరుగైన వైద్యం అందించండి... సీఎం జగన్  
ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టు చేసిన అచ్చెన్నాయుడును ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా గుంటూరు ఆసుపత్రికి తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.
 
ఈ పరిస్థితుల్లో సీఎం జగన్... అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై ఆరా తీశారు. అచ్చెన్న ఆరోగ్యం గురించి మీడియాలో వస్తున్న వార్తలను చూసి, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్న కోరుకున్న చోట ఆయనకు వైద్య సహాయం అందించాలని ఏసీబీ అధికారులను జగన్ ఆదేశించినట్టు విశ్వసనీయ సమాచారం.