1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Free drinking water programme inaugurated by Ministe KTR

భాగ్యనగరిలో ఉచిత మంచినీటి సరఫరా... ఇంటికి 20 వేల లీటర్లు ఫ్రీ

Hyderabad : Free Drinking Water
హైదరాబాద్‌ మహానగర పరిధిలో ఉచిత మంచినీటి సరఫరా పథకం మంగళవారం నుంచి ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా ఇదొక హామి. ఈ ఎన్నికల్లో ప్రతి ఇంటికి 20 వేల లీటర్లలోపు నీటిని ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ హామీని నెరవేర్చే ప్రక్రియలో భాగంగా, మంగళవారం ఉదయం 9.30 గంటలకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. 
 
ఇప్పటికే ఫ్రీ వాటర్‌ నీటిని పొందే వినియోగదారులు నల్లా కనెక్షన్‌, క్యాన్‌ నంబరు (క్యాన్‌) ఆధార్‌ నెంబరు లింకు చేయడంతో పాటు నల్లాకు నీటి మీటర్లను విధిగా ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కేటగిరీల వారీగా గైడ్‌లైన్స్‌లను జారీ చేసిన సర్కారు ఇందుకు మీ సేవా కేంద్రాలు లేదా WWW.HMWSSB.COM వెబ్‌సైట్‌ను సంప్రదించి ఆయా నల్లాలకు మార్చి 31లోగా విధిగా నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. 
 
ఇందుకోసం జలమండలి ప్రత్యేకంగా ఏజెన్సీలను నియమించారు. అలా ఏర్పాటు  చేసుకున్న వారికి 20 వేల లోపు నీటి వినియోగం ఉంటే నీటి సరఫరా ఉచితంగా ఉంటుంది. పథకం గురించి, అవసరమైన సేవలను అందించేందుకు వాటర్‌ బోర్డు ‘కస్టమర్‌ రిలేషన్‌ షిప్‌ మేనేజ్‌మెంట్‌' కేంద్రాలను ఏర్పాటు చేసింది. మేనేజ్‌మెంట్‌ వారు 155313 ఫోన్‌ నంబరులో అందుబాటులో ఉంటారు. ఆధార్‌ అనుసంధానం, మీటర్ల బిగింపు అనంతరం ఏప్రిల్‌ 1 తర్వాత నుంచి మంచినీటి బిల్లుల జారీ  ఉంటుంది. 20వేల లోపు నీటి వినియోగం ఉన్న వారికే ఉచిత నీటి సరఫరా వర్తిస్తుంది.
 
మరోవైపు, ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల లోపు నీటిని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం 9.30 గంటలకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ రహ్మత్‌నగర్‌లోని ఎస్‌పీఆర్‌ హిల్స్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, జలమండలి ఎండీ దానకిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.
 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఆమలులో భాగంగా ఈ ఫ్రీ వాటర్‌ పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు తలసాని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 10 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయని వివరించారు. సుమారు 70 లక్షల మంది ఈ పథకంతో లబ్ధి పొందుతారని చెప్పారు. 
About Writer
ఠాగూర్