1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (18:32 IST)

గ్రేటర్ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి, కేసీఆర్ ఖరారు చేసారా?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు కొత్త మేయర్‌గా గద్వాల విజయలక్ష్మిని సీఎం కేసిఆర్ ఖరారు చేశారని తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44, ఇతరులు 2 స్థానాలలో గెలుపొందారు. ఇటీవలే ఎన్నికల సంఘం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 
రేపు ఉదయం 11 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఉదయం పది గంటలకు కార్పొరేటర్లుగా గెలిచిన పార్టీ నేతలు.. ఎక్స్‌అఫిషియో సభ్యులు తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని.. అక్కడి నుంచి బస్సులో బల్దియా భవనానికి వెళ్లాలని కేసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. సీల్డ్ కవర్లో మేయర్ పేరును పంపుతానని కేసిఆర్ చెప్పడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. 
 
రెడ్డి సామాజిక వర్గానికి ఈ పదవిని ఇస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. కానీ తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కేసిఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీసీలకు రాజ్యాధికారం దక్కలేదన్న ఆగ్రహం తెలంగాణలో నెలకొంది. దీని ప్రభావం గ్రేటర్, దుబ్బాకలో కనబడిందని నిర్ణయానికి వచ్చిన కేసిఆర్ మేయర్ పదవిని బీసీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం. పార్టీ సీనియర్ నేత కేకే మంగళవారం ప్రగతి భవన్‌కు వెళ్ళి ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
 
గత ఎన్నికలలో ఇచ్చిన హామీని గుర్తు చేసిన కేకే తన కూతురు గద్వాల విజయలక్ష్మికి మేయర్ పదవిని ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఇదే సమయంలో బీజేపీ బీసీలకు రాజ్యాధికారం అప్పగించాలని చేస్తున్న డిమాండ్‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాలని కేసిఆర్‌కు కేకే సూచించాడని వార్తలు వినబడుతున్నాయి. కేకే నిర్ణయంతో ఏకీభవించిన కేసిఆర్ బీసీలకే మేయర్ పదవిని ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో బాటు గద్వాల విజయలక్ష్మి పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రేపు ఉదయం 11 గంటలకు రానుంది.