1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జులై 2022 (15:53 IST)

తెలంగాణాలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు

rain
తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల కారణంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్ ఈ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో సోమవారం నుంచి బుధవారం వరకు అన్ని విద్యా సంస్థలకు  సెలవులు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
ఆదివారం దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం సోమవారం ఒరిస్సా తీరంలోని వాయువ్య బంగాళఖాతంలో కేంద్రీకృతమై ఉందని, ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంపు తిరుగుతుందని వివరించింది. దీని ప్రభావం కారణంగా వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. 
 
ఆదివారం ఉపరితల ఆవర్తనం, ఈస్ట్‌వెస్ట్‌ షీర్‌ జోన్‌ సోమవారం 20ఎన్‌ వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొద్ది దక్షిణం వైపునకు వంపు తిరిగి ఉందని తెలిపింది. 
 
ఈ రోజు రుతుపవన ద్రోణి జైసల్మేర్‌, కోట, పెండ్రా రోడ్, బలంగిర్‌, అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
 
మరోవైపు, తెలంగాణలో వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడుతూ రక్షణ చర్యలపై ఆదేశాలు ఇస్తున్నారు. జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. 
 
గోదావరి, ఉపనదుల్లో వరద పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. అవసరమైన చోట్ల తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం పేర్కొన్నారు.