బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2020 (07:20 IST)

తెలంగాణలో అతిభారీ వర్షాలు.. అప్రమత్తం: కేసీఆర్

తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని సీఎస్ సోమేష్‌కుమార్‌కు సీఎం ఆదేశించారు.

పరిస్థితులను గమనిస్తూ సహాయ చర్యలు చేపట్టాలని, అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ హెచ్చరించారు.
 
వర్షాకాలం ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో వానలు ముంచెత్తుతున్నాయి. అకస్మాత్తుగా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఆకస్మికంగా అతి భారీవర్షం కురుస్తోంది. ఎందుకిలా జరుగుతోంది? అంటే.. దీనికంతటికీ ‘క్యుములోనింబస్‌’ మేఘాలే కారణమంటున్నారు హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు.

నిజానికి వేసవిలో ఏర్పడే క్యుములోనింబస్‌ మేఘా లు వర్షాకాలంలో పూర్తిగా తగ్గిపోవాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ అవి ఆకాశంలో 800-10,000 మీటర్ల ఎత్తులో అక్కడక్కడా ఆవరించే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సాధారణ వర్ష మేఘాలకు ఈ క్యుములోనింబస్‌ మేఘాలు తోడవుతుండడంతో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
 
భారీ వర్షాలకు ఇల్లు కూలి ఇద్దరి మృతి
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్న కురిసిన వర్షానికి పాతబస్తీలో పాత రేకుల ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇంట్లో ఉన్న ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.

వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందంతోపాటు స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో పురాతన భవనాలు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి.