1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (07:57 IST)

తడిసి ముద్దైన భాగ్యనగరి.. భారీ వర్షంతో అస్తవ్యస్తం

భాగ్యనగరి తడిసి ముద్దైంది. భారీ వర్షంతో హైదరాబాద్ నగర్ అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల వరుసగా కొన్నిరోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసిన విషయం తెల్సిందే. శుక్రవారం మరోమారు భారీ వర్షం పడింది. 
 
కుండపోతగా కురిసిన వానతో నగరం అతలాకుతలమైంది. దిల్ సుఖ్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, హయత్ నగర్, ఓల్డ్ సిటీ, రాజేంద్రనగర్, శంషాబాద్, మణికొండ, బంజారాహిల్స్, మీర్ పేట, చంపాపేట, పెద్ద అంబర్ పేట, అనాజ్ పూర్, సైదాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
 
సుమారు రెండుగంటల పాటు ఏకబిగిన పడిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాసేపటికే రోడ్లు చెరువుల్లా మారాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షంతో వెంటనే స్పందించిన జీహెచ్ఎంసీ సహాయ కార్యక్రమాలు, ఇతర సమాచారం కోసం 040 21111111 ఫోన్ నెంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.
 
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను అప్రమత్తం చేసి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కాగా, మరో మూడ్రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.