1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (11:06 IST)

మటన్ బిర్యానీ ధర రూ.265 - బిల్లు మాత్రం 467 చెల్లించాల్సిందే...

ప్రపంచ ప్రజలకు హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంత ఇష్టమే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ బిర్యానీని చాలా మంది రుచిచూడలేకపోతున్నారు. కొందరు మాత్రం ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చి ఇంటికి తెప్పించుకుని ఆరగిస్తున్నారు. అయితే, ధరను మాత్రం రెట్టింపుగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా హైదరాబాద్ మటన్ బిర్యానీ ధర రూ.265. కానీ ఆన్‌లైన్‌లో ఆర్డరిస్తే మాత్రం రూ.467 చెల్లించాల్సివస్తోంది. దీంతో మటన్ బిర్యానీ ప్రియులు నోరెళ్లబెడుతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సాధారణ రోజుల్లో హైద‌రాబాద్‌లో బిర్యానీ బిజినెస్ విప‌రీతంగా ఉంటుంది. అయితే, లాక్డౌన్ కార‌ణంగా మ‌ధ్యాహ్నం నుంచి రెస్టారెంట్లు, హోటళ్లు బంద్ అవుతుండ‌డంతో చాలా మంది ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసుకుని ఇంటికి తెప్పించుకుని తింటున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు అధిక బిల్లులు వడ్డిస్తున్నరు. 
 
అదనంగా పన్నులు వేస్తూ వినియోగ‌దారుల నుంచి దోపిడీ చేస్తున్నారు. కొత్త‌గా  హ్యాండ్లింగ్, ప్యాకేజింగ్‌ ఛార్జీల పేరుతో వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు చెందిన ఓ వ్య‌క్తి అప్పుడ‌ప్పుడు హోటల్‌కు వెళ్లి బిర్యానీ తినేవాడు. మ‌ట‌న్ బిర్యానీకి గానూ రూ.265 చెల్లించి వ‌చ్చేవాడు.
 
లాక్డౌన్ కార‌ణంగా ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేయాల‌నుకున్నాడు. అందులో బిల్లు రూ.405గా చూపించింది. అంతేకాదు, అద‌నంగా డెలివరీ పార్ట్‌నర్‌ రుసుము రూ.22, పన్నులు, ఇత‌ర‌ ఛార్జీల కింద రూ.40 మొత్తం బిల్లు రూ.467 క‌ట్టాల్సి వ‌చ్చింది. అంటే, అదనంగా మొత్తం రూ.202 చెల్లించుకున్నాడు. అంతేకాదు, ఇత‌ర ఆహార ప‌దార్థాలకు కూడా ప్యాకేజింగ్‌ ఛార్జీలు, పన్నులు అంటూ అద‌నంగా వ‌సూలు చేస్తున్నారు.
 
అదనపు వసూళ్లకు సంబంధించి స్పష్టమైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌భుత్వం రూపొందించ‌క‌పోవ‌డంతో హోట‌ళ్లు, రెస్టారెంట్లు ఇటువంటి దోపిడీకి పాల్ప‌డుతున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. బిల్లులు అధికంగా వేస్తే క‌స్ట‌మ‌ర్లు వెంట‌నే వినియోగదారుల మండలి లేక‌ తూనికలు కొలతలు, జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. 
 
ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని ఓ రెస్టారెంటుకు దోపిడీపై ఓ క‌స్ట‌మ‌ర్ ఫిర్యాదు చేయ‌గా, ఆ రెస్టారెంటుకు రూ.10వేల జరిమానా విధించి, కేసు ఖర్చుల కింద వినియోగ‌దారుడికి అద‌నంగా మ‌రో రూ.5 వేలు చెల్లించాలని ఫోరం చెప్పింది. అంతేగాక‌, నష్ట పరిహారం కింద వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.50 వేలు చెల్లించాలని ఆదేశించింది.