1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (12:43 IST)

చదువుపై శ్రద్ధ లేదు.. సారీ అమ్మా... విద్యార్థి ఆత్మహత్య

deadbody
బాసర ట్రిబుల్ ఐటీలో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అమ్మా నన్ను క్షమించు అంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం రాత్రి తన హాస్టల్ గదిలో భానప్రసాద్ అనే విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. 
 
ఇటీవలే తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆ క్యాంపస్‌లో పర్యటించి, విద్యార్థుల ధైర్యసాహసాలను ప్రత్యేకించి కొనియాడారు. ముఖ్యంగా, తమ సమస్యలపై విద్యార్థులంతా కలిసికట్టుగా ఆందోళన చేసిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. దీంతో ట్రిబుల్ ఐటీ క్యాంపస్‌లో పరిస్థితుల చక్కబడ్డాయని అందరూ భావించారు. 
 
ఇంతలోనే పీయూసీ 2 చదువుతున్న భానుప్రసాద్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్‌కు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
 
కాగా, భాను ప్రసాద్ ఆత్మహత్యకు ముందు ఓ సూసైడ్ లేఖ రాసిపెట్టాడు. అందులో.. అమ్మా నన్ను క్షమించు.. నాకు చదువుపై శ్రద్ధ కలగడం లేదు. తీవ్రమైన ఒత్తిడి, కఠిన నిబంధనల కారణంగానే చనిపోతున్నాను అని రాసిపెట్టినట్టు సమాచారం. అయితే, భానుప్రసాద్ ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని వీసీ అంటున్నారు.