శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (08:49 IST)

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి సబిత చర్చలు - నేటి నుంచి హాజరు

basara iiit
తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం రాత్రి ఐఐటీ బాసర విద్యార్థులతో సమావేశమయ్యారు. యూనివర్శిటీలో నెలకొన్న సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి హామీ ఇచ్చారు. 15 రోజుల్లో యూనివర్సిటీని సందర్శించి సమస్యలను పరిశీలిస్తానని వారికి హామీ ఇచ్చారు. 
 
మంత్రి హామీ మేరకు నేటి నుంచి తరగతులకు హాజరవుతామని విద్యార్థులు తెలిపారు. యూనివర్శిటీలో పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ క్లియర్ చేయాలని, వైస్ ఛాన్సలర్‌ను నియమించాలని డిమాండ్ చేస్తూ ఐఐటీ బాసర విద్యార్థులు వారం రోజులుగా నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే.
 
గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఈ ఆందోళన చేస్తున్నారు. వారి ఆందోళనకు విపక్ష పార్టీల నేతలతో పాటు విద్యార్థి సంఘాల నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో ఈ ఆందోళన ఉధృతంగా మారింది. విద్యార్థులను శాంతింపజేసేందుకు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రయత్నించారు. అయినప్పటికీ వారు శాంతించలేదు. 
 
ఈ నేపథ్యంలో విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగంలోకి దిగారు. విద్యార్థులతో సోమవారం అర్థరాత్రి వరకు చర్చలు జరిపారు. మంత్రి ఇచ్చిన హామీతో శాంతించిన విద్యార్థులు అర్థరాత్రి సమయంలో తమ ఆందోళనను విరమిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, మంగళవారం నుంచి తరగతులకు హాజరవుతామని తెలిపారు. 
 
మంత్రి సబితా రెడ్డితో జరిగిన చర్చల్లో ట్రిపుల్ ఐట డైరెక్టర్, నిర్మల్ జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చలు 2.30 గంటలకుపైగా జరిగాయి. విద్యార్థులు ఉంచిన 12 డిమాండ్లకు ప్రభుత్వం సమ్మతం తెలిపింది. ఈ హామీలను 15 నుంచి నెల రోజుల్లో పరిష్కరిస్తామనీ హామీ ఇచ్చారు.