1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 జూన్ 2023 (19:50 IST)

మరింతగా విస్తరించిన నైరుతి - తెలంగాణాకు వర్ష సూచన

rain
తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించాయని, ఈ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా, వచ్చే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. ఫలితంగా వచ్చే 24 గంటలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. 
 
భారత వాతరణ శాఖ సూచన మేరకు.. మంచిర్యాల, సిరిసిల్ల, కుమరం భీం, కరీంనగర్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లిలలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఉత్తర, ఈశాన్య, మధ్య తెలంగాణ జిల్లాల్లో అధిక వర్షంపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే, హైదరాబాద్ నగరంలో కూడా ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
ఏపీలో బీసీలకు రక్షణ లేదు... హీరో సుమన్ 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కులాలకు చెందిన ప్రజలకు చెందిన ధనమాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని హీరో సుమన్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ, ఏపీలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. 
 
బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్‌పై పెట్రోల్‌ పోసి హతమార్చిన ఘటనలో ఇప్పటివరకు నిందితులపై చర్యల్లేవని మండిపడ్డారు. రాష్ట్రంలో కులానికొక పార్టీ ఉందని.. బీసీలకు మాత్రం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో  బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పార్టీకే మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మేలుచేసే పార్టీల వద్దకే బీసీలు వెళ్లాలని సూచించారు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చినందుకే కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించిందన్నారు.
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలి : జేపీ నడ్డా 
 
ఈ యేడాది ఆఖరు నెలలో జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన నేరుగా నోవాటెల్ హోటల్‌కు వెళ్లి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. నేతలంతా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 
 
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలు రఘునందన్‌ రావు, విజయశాంతి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌రావు తదితరులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో నడ్డా చర్చిస్తున్నారు. ఎన్నికల సన్నద్ధతపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని నడ్డా హెచ్చరించారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. భారాసతో రాజీలేదని.. ఆ పార్టీతో సీరియస్‌ ఫైట్‌ ఉంటుందని నడ్డా స్పష్టం చేశారు.