1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 15 జూన్ 2023 (11:32 IST)

తరుముకొస్తున్న బిపోర్జాయ్ తుఫాను.. గుజరాత్‌లో హైఅలెర్ట్.. ఆఫీసులు మూసివేత

Cyclone Biporjoy
బిపోర్జాయ్ తుఫాను తరుముకొస్తుంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆఫీసులతో పాటు ఆలయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మూసివేసింది. ఈ తుఫాను గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గుజరాత్ రాష్ట్రంలో తీరం దాటొచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. కచ్‌ సమీపంలోని మాండ్వి - పాక్‌లోని జఖౌ మధ్య తీరం దాటుతుందని అంచనావేసింది. తుఫాను తీరం దాటేవేళ గంటకు 150 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయని హెచ్చరించింది. దాంతో గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. ఇక సౌరాష్ట్ర, కచ్‌ తీరాల్లో సాయంత్రం వరకు సముద్రం కల్లోలంగా ఉండనుంది. 
 
ప్రస్తుతం ఈ తుఫాను గుజరాత్‌ తీరానికి 200 కి.మీ లోపు దూరంలోనే ఉందని అధికారులు వెల్లడించారు. ఇది స్వల్పంగా బలహీనపడినా గుజరాత్‌కు ముప్పు పొంచే ఉంటుందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. ఈ తుఫాను ముప్పుతో గుజరాత్‌ తీర ప్రాంతాల్లోని సుమారు 74 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
 
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాటిలో ఎక్కువ కాలం కొనసాగనున్న తుపానుగా బిపోర్జాయ్‌ నిలవనుంది. జూన్‌ ఆరు ఇది ఏర్పడింది. తీరాన్ని తాకిన తర్వాత కూడా ఇది మరికొన్ని రోజులు ఉనికిలో ఉంటుంది. ఇక తుఫాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సమీప ప్రాంతాల్లో 144 సెక్షన్‌లో అమల్లో ఉంచారు. ఆలయాలు, కార్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు. తీర ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. 
 
మరోవైపు, బిపోర్జాయ్ తుఫాను ప్రభావంతో గుజరాత్‌తోపాటు మరో 8 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీంతో కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గోవా రాష్ట్రాలతోపాటు దామన్ దీవ్‌, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. ఇక తుఫాను నేపథ్యంలో పాకిస్థాన్‌లోని తీర ప్రాంత పట్టణాలు, అరేబియా ద్వీప దేశాల్లో ముందుజాగ్రత్త చర్యలు తీసుకొన్నారు.