శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (09:25 IST)

ఆ చట్టం కింద కేసు నమోదైతే ఎందుకూ పనికిరారు... భవిష్యత్తే నాశనం...

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో ఈ చట్టం అమలుకు అన్ని రాష్ట్రాలు కూడా తమవంతు కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా, ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రజలు తమ ఇళ్ళు వదిలి వీధులు, రోడ్లపైకి రాకుండా ఉండేలా కట్టడి చేసేలా పూర్తి అధికారాలను పోలీసులకు అప్పగించారు. అయితే, అనేక ప్రాంతాల్లో ఈ లాక్‌డౌన్ ఆదేశాలను యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. 
 
ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ వాసులు ఈ లాక్‌డౌన్ ఆదేశాలను అస్సలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ఏదో ఒక సాకుతో రోడ్లపైకి వస్తున్నారు. మంగళవారం నుంచి గురువారం మధ్య ఈ మూడు రోజుల్లోనూ వందలాదిమంది రోడ్లపైకి వచ్చారు. 
 
హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల కంటే ఓల్డ్ సిటీ వాసులే రోడ్లపైకి వచ్చి చక్కర్లు కొడుతున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు... ఇకపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా కేంద్ర ప్రభుత్వ జీవో 45, 46, 48 ప్రకారం కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) అనిల్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు.
 
నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై ఐపీసీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టాన్ని ప్రయోగిస్తామన్నారు. ఒకసారి ఈ చట్టాల కింద కేసులు నమోదైతే ఎందుకూ పనికిరాకుండా పోతారని హెచ్చరించారు. 
 
కేసులు నమోదైన వారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలన్నా, ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనా, పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం ఉండదని పేర్కొన్నారు.  అంతేకాదు, కేసు నమోదైతే గరిష్టంగా ఆరు నెలల నుంచి ఏడాది పాటు జైలు శిక్ష ఎదుర్కోవడంతోపాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.