శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (14:10 IST)

కడుపు కొట్టిన కరోనా... బతుకు బండి లాక్కొన్న ఖాకీలు.. మనస్తాపంతో యువకుడు...

కరోనా వైరస్ అతని జీవనోపాధిపై కొట్టింది. ఫలితంగా కడుపు మాడ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకచేసేదేంలేక తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఆ బండిని పోలీసులు లాక్కున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ బండిని సీజ్ చేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ యువకుడు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణాజిల్లా మండవల్లి మండల పుట్లచెరువుకు చెందిన పేటాడ శ్రీనివాస రావు (22) అనే యువకుడు చిత్తూరు జిల్లా తిరుపతిలో టీషర్టుల తయారీ కంపెనీలో పనిచేస్తూ జీవనంగడుపుతున్నాడు. లాక్‌డౌన్‌తో కంపెనీ మూసివేయడంతో ద్విచక్రవాహనంపై సగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టూవర్టుపురంలోని వెదుళ్లపల్లి చెక్‌ పోస్ట్‌ వద్ద శ్రీనివాస రావును పోలీసులు ఆపారు. 
 
ఆయన ప్రయాణిస్తున్న బైకు చెన్నై రిజిస్ట్రేషన్ కావడంతోపాటు కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి మూడు జిల్లాల సరిహద్దులు దాటి రావటంపై పోలీసులు ప్రశ్నించారు. కేసు నమోదు చేసి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం బైక్‌ను అందజేస్తామని చెప్పారు. దీంతో శ్రీనివాస రావు కాలినడకన అక్కడి నుంచి బాపట్ల బస్‌స్టాండ్‌కు చేరుకొన్నారు. స్వగ్రామానికి వెళ్లేందుకు మార్గం కనిపించకపోవడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.