1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (14:34 IST)

చికెన్ బిర్యానీ తిన్న యువకుడు రక్తం కక్కుకుని మృతి

ఓ రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ తిన్న యువకుడు ఆ వెంటనే రక్తం కక్కుకుని మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో చోటుచేసుకుంది. చెన్నరావుపేట మండల పరిధిలోని బోడ తండా వాసి ప్రసాద్(23) ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. తనకు ఇష్టమైన చికెన్ బిర్యానీ తిన్నాడు.
 
అయితే రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే అతనికి వాంతులు వచ్చాయి. రక్తం కూడా నోట్లో నుంచి పడడంతో ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని వెంటనే ప్రసాద్‌ను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లగా అప్పటికే ప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. 
 
మున్సిపల్ అధికారులు రెస్టారెంటుకు చేరుకుని అక్కడి ఫుడ్ శాంపిల్స్‌ను సేకరించి పరిశీలిస్తున్నారు. ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యే అవకాశం ఉంది.