1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (14:38 IST)

మణికొండలో గోతిలో పడి చనిపోయిన వ్యక్తి గుర్తింపు...

హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి రెండు గంటల పాటు కుంభవృష్టి కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమలో మ‌ణికొండ‌లో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంత‌లో ఓ వ్యక్తి పడి గల్లంతయ్యాడు. 
 
ఆ వ్యక్తిని జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. అతని పేరు గోపిశెట్టి ర‌జ‌నీకాంత్ (42)గా పోలీసులు గుర్తించారు. అత‌డి ఇల్లు ఘ‌ట‌నాస్థ‌లికి 50 మీట‌ర్ల దూరంలోనే ఉంది. అత‌డు షాద్ న‌గ‌ర్‌లోని నోవా గ్రీన్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తున్నాడు.
 
శనివారం రాత్రి 9 గంట‌ల‌కు ఇంటిని నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి నీటిలో ఉన్న డ్రైనేజీ గుంత‌ను చూసుకోకుండా అడుగు వేయడంతో అందులో ప‌డ్డాడు. అత‌డి కోసం 2 డీఆర్ఎఫ్ బృందాలు 15 గంట‌లుగా గాలిస్తున్నాయి. 
 
ప్ర‌స్తుతం నాలాలు క‌లిసే ప్రాంతంలో ర‌జనీకాంత్ కోసం ఓ బృందం గాలిస్తోంది. అలాగే, చెరువు వ‌ద్ద కూడా మ‌రో బృందం గాలిస్తోంది. కాగా శనివారం రాత్రి ఏకధాటిగా కురిసిన వర్షంతో హైద‌రాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు నీట‌ మునిగిన విష‌యం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి.