శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (08:27 IST)

బర్త్ డే పార్టీకి వెళితే బాలికపై అత్యాచారం.. ఆపై అర్ధనగ్నంగా సెల్ఫీ తీసి..?

మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతూనే వున్నాయి. నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మార్పు రావట్లేదు. ఆడపిల్లకు రక్షణ లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మాయమాటలతో నమ్మించి గొంతు కోస్తున్నారు. బయటి వారే కాదు బంధువులు కూడా కామంతో కాటేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. బంధువు అని నమ్మి వెళితే ఆ బాలిక జీవితం నాశనమైంది.
 
ఓ బాలికపై దూరపు బంధువైన ఓ యువకుడు అత్యాచారం చేసిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. మూసాపేట జనతానగర్‌లో నివాసముంటున్న జై బాలు (25) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికను పరిచయం చేసుకున్నాడు. 
 
ఈ క్రమంలో బాలికపై కన్నేసిన బాలు.. ఎలాగైనా కోరిక తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. సమయం కోసం చూశాడు. మార్చి 17న తన పుట్టిన రోజు ఉందని బాలికను ఇంటికి పిలిపించుకున్నాడు. అతడిని నమ్మి వచ్చిన బాలిక మోసపోయింది. బాలికపై ఆ నీచుడు అత్యాచారం చేశాడు. అంతేకాదు అర్ధనగ్నంగా సెల్ఫీ కూడా తీసి తన స్నేహితులకు పోస్టు చేశాడు.
 
ఆ ఫొటో బాలిక బంధువులకు చేరటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఏప్రిల్ 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బలవంతంగా తనను అత్యాచారం చేసినట్లు బాలిక ఫిర్యాదులో తెలిపింది. ఈ విషయం తెలిసిన బాలు పరారీలో ఉన్నాడు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.