1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (14:07 IST)

కీసీఆర్‌కు దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయాలి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

komatireddy rajagopal reddy
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. కేసీఆర్‌కు దమ్ముంటే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ఛాలెంజ్ చేశారు. 
 
వచ్చే నెల మూడో తేదీన జరుగనున్న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఉప ఎన్నికలో నామినేషన్‌ వేసేందుకు పెద్ద ఎత్తున భాజపా కార్యకర్తలు, నేతలతో రాజగోపాల్‌రెడ్డి వెళ్లారు. నామినేషన్‌ వేసిన అనంతరం చండూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయాలని సవాల్‌ విసిరారు.  
 
'మునుగోడులో పోటీకి కేసీఆర్‌ వస్తారా? కేటీఆర్‌ వస్తారా? సిద్దిపేట రోడ్లు.. మునుగోడు రోడ్లకు తేడా చూడండి. కేసీఆర్‌.. మీరు రాష్ట్ర ప్రజల సొత్తు లక్ష కోట్లు దోచుకున్నారు. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. వచ్చే బతుకమ్మ నాటికి కవిత తీహార్‌ జైలుకు వెళ్తారు. ప్రజలందరికి దృష్టి మునుగోడు ఉప ఎన్నికపైనే ఉంది. దేశం మొత్తం దీనిపై చర్చించుకుంటోంది' అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.