1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (10:37 IST)

హుజురాబాద్‌లో బీజేపీ ఆధిక్యం - తెరాసకు షాకిచ్చిన స్వతంత్ర అభ్యర్థి

కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్‌లో 166 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉన్నరు. తొలిరౌండ్‌లో బీజేపీకి 4,610 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌ కు 4,444, కాంగ్రెస్‌ కు 119 ఓట్లు వచ్చాయి. అయితే…ఈ కౌంటింగ్‌‌లో టీఆర్‌ఎస్‌‌కు షాక్‌ తగిలింది. కారు గుర్తును పోలిన చపాతీ రోలర్ గుర్తు వలన తమకు నష్టం జరిగిందని టీఆరెస్ శ్రేణులు దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో వాపోయిన విషయం గుర్తుండే ఉంటుంది.
 
ఇప్పుడు ఆ విషయం మరోసారి వార్తల్లోకి వస్తోంది. ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికలో ‘చపాతీ రోలర్’ గుర్తుపై ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ పోటీ చేస్తున్నారు. ఆయన మొదటి రౌండ్లో 122 కోట్లు సాధించి ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తున్నారు. 
 
కౌంటింగ్ మొత్తం పూర్తయ్యే వరకు ఎన్ని ఓట్లు పొందుతారో అని టీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. అలాగే… మరో స్వతంత్ర్య అభ్యర్థి… వజ్రం గుర్తుకు 113 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు, కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఈ ఓట్ల లెక్కింపులో అధికారులు ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించారు. బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపుతోనే టీఆర్‌ఎస్‌ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 
 
మొత్తం 753 బ్యాలెట్‌ ఓట్లను లెక్కించగా అందులో తెరాసకు ఓట్లు ఆధికంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లలో 503 టీఆర్ఎస్ కు రాగా, బీజేపీకి 159, కాంగ్రెస్ కు 32 ఓట్లు వచ్చాయి.
 
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించిన అనంతరం హుజురాబాద్‌ ఓట్లను లెక్కించనున్నారు. ఆ తరువాత వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రంలోపు హుజురాబాద్‌ బాద్‌షా ఎవరన్నది ఖరారు కానుంది.