శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (18:38 IST)

తెలంగాణ బిడ్డలు రాజ్యం ఏలాలి.. రాజన్న బిడ్డలు కాదు.. రేవంత్ రెడ్డి

వైఎస్ షర్మిల కొత్త పార్టీ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి.. షర్మిల కొత్త పార్టీ వెనుక ఉన్నది సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేరు కాబట్టి... కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు షర్మిలను రంగంలోకి దించారని విమర్శించారు. 
 
షర్మిల కేసీఆర్ వదిలిన బాణమని ధ్వజమెత్తారు. వైఎస్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజారంజకమైన పాలన అందించారనే విషయం మర్చిపోవద్దని అన్నారు. 
 
అయినా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది తెలంగాణ బిడ్డలు రాజ్యం ఏలాలని మాత్రమే అని... రాజన్నబిడ్డలు రాజ్యం ఏలాలని కాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ మధ్య కొనసాగుతున్న కృష్ణా జలాల అంశంపై షర్మిల వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.