1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. RS Praveen Kumar sensational comments on KCR

తెలంగాణాలో ఉత్సవ విగ్రహాలుగా దళిత ఎమ్మెల్యేలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar
తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన 29 మంది దళిత శాసనసభ్యులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని ఇటీవల తన పదవికి స్వచ్ఛంద విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి, స్వేరోస్‌ వ్యవస్థాపకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం దళిత ముఖ్యమంత్రి అని చెప్పి.. గతంలో మోసగించారన్నారు. అలాంటి పరిస్థితులను తిరిగి రానివ్వొద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. 
 
సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ చౌరస్తాలోని ఓ ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం రాత్రి వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉప ఎన్నిక ఉన్నందునే హుజూరాబాద్‌కు రూ.1000 కోట్లు కేటాయించారని పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. ఆ డబ్బును రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలకు ఖర్చు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని విమర్శించారు. 
 
బానిస బతుకులు మారాలని, బీరు, బిర్యానీలకు ఓట్లు వేసే కాలం పోవాలనే తాను ఉద్యమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజా సేవ చేసేందుకే ఉద్యోగాన్ని వదులుకున్నానని, ఎవరికీ అమ్ముడుపోకుండా.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని ప్రకటించారు. రాజీనామా చేసిన మరుసటిరోజే తనపై కేసు పెట్టారని, ఎన్ని కేసులు నమోదు చేసినా భయపడేది లేదని ప్రవీణ్ కుమార్ అన్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మంత్రా.. మజాకా... ఐదేళ్ళలో ఆయన ఆస్తి పదింతల పెరుగుదల...