1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 జులై 2021 (09:59 IST)

ఢిల్లీలో చక్రం తిప్పనున్న మమత బెనర్జీ!?

ఢిల్లీ రాజకీయాల్లో పశ్చిమబెంగాల్‌ సీఎం దీదీ చక్రం తిప్పనున్నారని తెలిసింది. 2024లో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిత్వ రేసులో ముందున్న మమతా బెనర్జీ ఇక ఢిల్లీ రాజకీయాలపై ఫోకస్ పెంచనున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌కు కొత్త ముఖ్యమంత్రిని నియమిస్తారా? అనే అనుమానాలకూ తావిచ్చేలా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా మమతా బెనర్జీ ఎన్నికయ్యారు.
 
ఆ పార్టీ ఎంపీలంతా కలిసి తమ అధినేత్రిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ ఓబ్రెయెన్‌ వెల్లడించారు. పార్లమెంటరీ పార్టీని మార్గదర్శనం చేయడంలో ఆమెకు ఎంతో అనుభవం ఉన్నందునే ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మమతా బెనర్జీ పార్లమెంట్‌ సభ్యురాలు కాకపోయినా ఆమెను పార్లమెంటరీ పార్టీ ఛైర్‌ పర్సన్‌గా నియమించారు.
 
ఈ చర్యతో మమతా బెనర్జీ ఇక ఢిల్లీలో చక్రం తిప్పుతారా అనే దానిపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీ ఢిల్లీ టూర్‌ కూడా ఖరారయ్యింది. ప్రధాని మోదీ, రాష్ట్రపతితో పాటు ప్రతిపక్ష నేతలతో ఆమె సమావేశం కానున్నారు. మరో నాలుగు నెలల్లో ఆమె ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక అయితేనే సీఎంగా కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఆమె అల్లుడు అభిషేక్‌ బెనర్జీని సీఎం చేసి దీదీ ఢిల్లీ రాజకీయాలు నడిపే అవకాశముందని ప్రచారం సాగుతోంది.