శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 19 అక్టోబరు 2019 (18:30 IST)

భారీ వర్షం: ఫ్రెండ్ పెళ్లికి వెళ్లొస్తూ సాగర్‌లో జల సమాధి అయిన ఆరుగురు

ఫ్రెండ్ పెళ్లికి వెళ్లొస్తూ సాగర్‌లో జల సమాధి అయిన ఆరుగురు విషాద వార్త సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో ఆనందంగా తన స్నేహితుడి పెళ్లి చూసి స్కార్పియో కారులో తిరిగి వస్తుండగా భారీ వర్షం మొదలైంది. అంతే.. వెనుక కారులో తమ స్నేహితులు చూస్తుండగానే స్కార్పియో వాహనం అదుపుతప్పి నడిగూడెం మండలం చాకిరాల వద్ద సాగర్‌ కాల్వలోకి దూసుకెళ్లిపోయింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు చనిపోయారు.
 
ఈ ప్రమాదంలో మృత్యువాత పడినవారంతా హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌లో ఉన్న అంకుర్ హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. తమ స్నేహితుడు వివాహం చాకిరాలలో కావడంతో అంతా కలిసి హాజరయ్యారు. ఆ తర్వాత తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది. కాగా మృతి చెందినవారు అబ్దుల్‌ అజీజ్, జిన్సన్, రాజేష్, సంతోష్‌, పవన్‌, నగేష్‌గా గుర్తించారు.