1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (13:20 IST)

సింగరేణి బొగ్గు గనుల్లో మోగిన సమ్మె సైరన్

తెలంగాణా రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల్లో సమ్మె సైరెన్ మోగింది. ఇదే అంశంపై సింగరేణి యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. సింగరేణి సంస్థను కేంద్రం ప్రైవేటీకరించబోతుందన్న వార్తల నేపథ్యంలో వారు సమ్మెకు దిగనున్నారు. 
 
ఇందులోభాగంగా ఈ నెల 28, 29వ తేదీల్లో సమ్మె చేబట్టబోతున్నామని సింగరేణి యాజమాన్యానికి ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల ప్రతినిధులు సంతకాలు చేసిన సమ్మె నోటీసులు అందించారు. 
 
సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి అయ్యే బొగ్గును నల్లబంగారంతో పోల్చుతారు. దీన్ని తవ్వే సమయంలో బొగ్గు గనుల్లో ఏర్పడే ప్రమాదాల్లో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికులు పని చేస్తూ నల్లబంగారాన్ని వెలికి తీస్తున్నారు. 
 
అలాంటి నల్ల బంగారం గనులను కేంద్రం ప్రైవేటీకరించాలని చూస్తోంది. దీన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే అంశంపై తమ నిరసన తెలిపేందుకు వీలుగా ఈ నెలాఖరులో రెండు రోజుల పాటు సమ్మె చేపట్టాలని నిర్ణయించి, నోటీసులు ఇచ్చారు.