1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana Assembly Elections : Above 65 Years Candiates Contest various Parties

వయస్సుతో పనేముంది.. గెలుపే ముఖ్యం - అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతున్న 65+

telangana assembly poll
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోని పలు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వయసు 65+గా గా ఉంది. ఇలాంటి వారంతా తమ రాజకీయ అనుభవం లేనంత వయస్సున్న యువకులతో పోటీపడుతున్నారు. ఎన్నికల్లో వయసుతో పని లేదని, గెలుపే ముఖ్యమని వారు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న 65 యేళ్ళు పైబడిన అభ్యర్థుల్లో కొందరు ప్రముఖ నేతలను పరిశీలిస్తే, 
 
మర్రి శశిధర్ రెడ్డి (వయసు 74) - సనత్ నగర్ బీజేపీ అభ్యర్థి 
సనత్ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మర్రి శశిధర్ రెడ్డి వయసు 74 యేళ్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత మర్రి చెన్నారెడ్డి కుమారుడైన శశిధర్ రెడ్డి తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. 1992లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటివరకు ఆరు సార్లు పోటీ చేస్తే.. నాలుగు సార్లు విజయం సాధించారు. తాజాగా ఇదే నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గ్రేటర్‌లో బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఈయనే సీనియర్ కావడం గమనార్హం. 
 
చింతల రామచంద్రారెడ్డి (వయసు 69)- ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థి 
భారతీయ జనతా పార్టీలోని తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతల్లో సీనియర్ నేత. ఈయన వయసు 69 సంవత్సరాలు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై గెలుపొందారు. 2018లో ఇదే సెగ్మెంట్లో పోటీ చేసి తెరాస అభ్యర్థి దానం నాగేందర్ చేతిలో ఓటమి పాలయ్యారు. తాజాగా మరోసారి బీజేపీ తరపున బరిలోకి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 
 
కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (వయసు 67) - మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి 
మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి వయసు 67 ఏళ్లు. 2009లో మేడ్చల్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014, 2018లో కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 
 
పద్మారావు గౌడ్ (వయసు 69) - సికింద్రాబాద్ భారాస అభ్యర్థి 
సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పద్మారావు గౌడ్ వయసు 69 యేళ్లు. కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ జీవితం ప్రారంభించిన పద్మారావు గౌడ్ ఆ పార్టీలో వివిధ పదవులు చేపట్టారు. తెరాస ఏర్పాటైన తర్వాత 2001లో అందులో చేరారు. 2004లో సికింద్రాబాద్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో సనత్ నగర్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. తాజాగా ముచ్చటగా మూడోసారి గెలుపుపై దృష్టిసారించారు. 
 
ముఠా గోపాల్ (వయసు 70) - ముషీరాబాద్ భారసా అభ్యర్థి 
ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముఠా గోపాల్ వయసు 70 ఏళ్లు, తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఈయన తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాసలో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ముషీరాబాద్ సెగ్మెంట్ నుంచి తెరాస తరపున పోటీ చేసి బీజేపీకి చెందిన కె.లక్ష్మణ్ చేతిలో 27,338 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఇదే సెగ్మెంట్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌పై 36,910 ఓట్ల మెజా ర్టీతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో మరోమారు పోటీకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 
About Writer
వరుణ్
తర్వాతి కథనం
నేటి నుంచి తెలంగాణాలో పవన్ కళ్యాణ్ ప్రచారం.. తొలి సభ వరంగల్‌లో...