1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (08:06 IST)

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.... కీలక బిల్లుల ఆమోదానికి కసరత్తు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశంలో మృతి చెందిన శాసన సభ్యులకు సంతాపం తెలియజేయనున్నారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. 
 
ఇక సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ సారి అసెంబ్లీ సమావేశాలు వారం పాటు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ, నెల రోజుల పాటు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇందుకు ప్రభుత్వం సముఖంగా లేదు. 
 
మరోవైపు ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన బిల్లులను ఆమోదింపజేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా, దళిత బంధుకు సంబంధించిన బిల్లు కూడా ఉంది. అటు విపక్షాలు కూడా ద‌ళిత‌బంధుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటున్నాయి. బ‌డ్జెట్లో నిధులు కేటాయించ‌కుండా, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ప‌థ‌కాన్ని ఎలా అమ‌లు చేస్తారో చెప్పాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
అదేవిధంగా వివిధ ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ జరగాలంటోంది. ఆసరా పెన్షన్స్ పంపిణీలో జాప్యంపై గళమెత్తాలని బీజేపీ నిర్ణయించింది. దళిత బంధు పథకం అమలు తీరు, నిరుద్యోగ భృతితో పాటు ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటోంది. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ అంశంతో పాటు ఉద్యోగ నియామకాలపైనా తెరాస ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయి. మొత్తంమీద ఈ సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి.