1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (16:28 IST)

ముస్లింల జనాభాపై తప్పుడు ప్రచారం : దిగ్విజయ్ సింగ్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2028 నాటికి హిందువులు, ముస్లింల్లో సంతాన సాఫ‌ల్య రేటు ఒకే విధంగా ఉంటుంద‌న్నారు. గతంలో వెల్లడైన గణాంకాల మేరకు 1951 నుంచి ముస్లింల్లో సంతానోత్ప‌త్తి రేటు హిందువుల‌తో పోలిస్తే అధికంగా త‌గ్గుతోందన్నారు. 
 
కానీ, ప్ర‌స్తుతం ముస్లింల్లో సంతాన సాఫ‌ల్య రేటు 2.7 శాతం కాగా, హిందువుల్లో ఇది 2.3 శాతంగా ఉంద‌ని.. 2028 నాటికి ఇది హిందూ, ముస్లింలలో స‌మానంగా ఉంటుంద‌ని దిగ్విజ‌య్ సింగ్ వ్యాఖ్యానించారు. 
 
ముస్లింల జ‌నాభా పెరుగుతోంద‌ని త్వ‌ర‌లో వారి జ‌నాభా హిందువుల‌ను అధిగ‌మిస్తుంద‌ని కొంద‌రు పేర్కొంటున్న నేప‌థ్యంలో దిగ్విజ‌య్ సింగ్ ఈ వ్యాఖ్య‌లు చేయడం గమనార్హం. 
 
ముస్లింల జ‌నాభా పెరుగుద‌ల గురించి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని అంటూ ఈ అంశంపై బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని మోహ‌న్ భ‌గ‌వ‌త్ స‌హా ఆరెస్సెస్ ప్ర‌చార‌క్‌ల‌కు ఆయ‌న స‌వాల్ విసిరారు. ముస్లింల సంతానోత్ప‌త్తి రేటు త‌గ్గుతున్న‌ద‌ని, హిందువుల కంటే ముస్లింలు ఈ దేశంలో ఎన్న‌డూ మెజారిటీలు కాబోర‌ని తాను నిరూపిస్తాన‌ని చెప్పారు.