శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 మే 2021 (15:24 IST)

మీరెందుకు రోడ్లు మీద ఉన్నారు.. నేను లోకల్‌ ఎంపీని.. మీలాగే సేవ చేస్తున్నా: రేవంత్ రెడ్డి

లాక్డౌన్ అమల్లోవున్న సమయంలో పోలీసులుగా ఉండి మీరెందుకు రోడ్ల మీద తిరుగుతున్నారు. పైగా, నేను లోకల్ ఎంపీని. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు వారికి సేవ చేయడానికి రోడ్డుపైకి వచ్చాను. అలాంటి నన్ను ఎలా అడ్డుకుంటారు. నన్ను అడ్డుకోమని చెప్పిందెవరు? అంటూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసులను నిలదీశారు. 
 
ఆదివారం గాంధీ ఆసుపత్రి దగ్గర రోగుల బంధువులకు భోజనాలు పెట్టడానికి వెళుతున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని బేగంపేటలో పోలీసులు అడ్డుకున్నారు. తనను అడ్డుకున్న పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. 
 
ఓ ఎంపీగా నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి వెళుతుంటే ఇలా అడ్డుకోవడం ఏంటని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'నేను లోకల్ ఎంపీని.. నన్ను ఆపమని చెప్పిందెవడు? మీకు ఆదేశాలు ఎవరిచ్చారో చెప్పండి. ఆ కాగితాలు చూపండి. మెలకువలోనే ఉండి మాట్లాడుతున్నారా? 
 
ఈ ప్రభుత్వానికి బుర్ర ఉండే మాట్లాడుతుందా? నేను ఇక్కడి ఎంపీని. మీ ఆంక్షలు గాంధీ ఆసుపత్రి దగ్గర పెట్టుకోండి. బేగం పేటలో కాదు. నేను గాంధీ, సికింద్రాబాద్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు పెట్టుకున్నాను. నన్ను ఆపమని చెప్పిందెవరు? నేను సామాన్య పౌరుడిని కాదు. స్థానిక ఎంపీని. మీరెందుకు వచ్చారు రోడ్డు మీదకి? మీలాగే నేను కూడా రోడ్డు మీదకు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గరకు వెళుతుంటే ఎందుకు ఆపుతున్నారు' అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. 
 
గాంధీ ఆసుపత్రి దగ్గర రోగుల బంధువులకు నిత్యం వెయ్యి మందికి అన్నదానం చేసే కార్యక్రమాన్ని శనివారం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రెండో రోజు ఈ కార్యక్రమాన్ని గాంధీతో పాటు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా చేపట్టాలని ఎంపీ భావించారు. 
 
ఈ నేపథ్యంలోనే ఎంపీ రేవంత్‌ను బేగంపేట పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ వాహనాన్ని చుట్టుముట్టి ముందుకు కదలనీయలేదు. దీంతో పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు.