శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (11:28 IST)

తీరుమారని పోలీసులు.. రోగి మృతి... ధిక్కరణ పిటిషన్ దాఖలు...

తెలంగాణ రాష్ట్ర పోలీసుల తీరు ఏమాత్రం మారలేదు. తెలంగాణ హైకర్టు హెచ్చరికలను సైతం వారు బేఖాతర్ చేశారు. దీంతో ఏపీ - తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. దీంతో పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఒకరు మృతి చెందారు. గత రాత్రి 12 గంటల నుంచి పోలీసులు అంబులెన్స్‌లను తెలంగాణలోకి రాకుండా నిలిపివేశారు. సుమారు వంద అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. 
 
బాధితులు ఎంత బ్రతిమలాడినా పోలీసులు, వైద్యశాఖ అధికారులు ఒక్క అంబులెన్స్‌ను కూడా అనుమతించలేదు. దీంతో శుక్రవారం తెల్లవారుజాము మూడు గంటలకు ఓ అంబులెన్స్‌లో ఉండే పేషెంట్ మృతి చెందాడు. అయితే ఆ రోగి వివరాలు తెలియరాలేదు. 
 
రోగి మృతిచెందిన వెంటనే అంబులెన్స్ తిరిగి వెళ్లిపోయినట్లు తెలియవచ్చింది. ఆస్పత్రి అనుమతి, అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక అనుమతి ఉంటేనే తప్ప పోలీసులు పుల్లూరు టోల్ గేట్ నుంచి అనుమతించడంలేదు. 
 
మరోవైపు, తెలంగాణ పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఆర్ఎస్ గరిమళ్ల వెంకటకృష్ణరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నాలుగు రోజుల క్రితం కూడా సరిహద్దులో అంబులెన్స్‌లను నిలిపివేస్తున్నారని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 
 
పిటిషన్‌పై స్పందించి పోలీసులపై హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. అంబులెన్స్‌లను ఆపితే కోర్టు ధిక్కరణ కిందకు తీసుకోవాల్సి వస్తుందని.. అప్పుడే తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు చెప్పింది. అయినప్పటికీ మళ్లీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 
ఫలితంగా ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో పేచీ మళ్లీ మొదటికి వచ్చింది. అంబులెన్స్‌లను ఆపడం మానవత్వమేనా? అంటూ హైకోర్టు అక్షింతలు వేసినప్పటికీ పోలీసుల తీరు మాత్రం మారడం లేదు. తెలంగాణ - ఏపీ బోర్డర్లన్నింటి వద్ద నేడు పోలీసులు అంబులెన్స్‌లను అడ్డుకున్నారు. 
 
ఈ క్రమంలోనే గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసులు ఏకంగా 20 అంబులెన్సులను అడ్డుకున్నారు. దీంతో సకాలంలో వైద్యం అందక ఒక రోగి మృతి చెందాడు. హైకోర్టు ఆదేశాలతో రెండు రోజులుగా ఏపీ అంబులెన్స్‌లను అనుమతిస్తున్నారు. అయితే గురువారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పోలీసులు అంబులెన్స్‌లను అడ్డుకున్నారు. దీంతో హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.