1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (08:48 IST)

నేటి నుంచి తెలంగాణ వార్షిక బడ్జెట్ సమావేశాలు... గవర్నర్ ప్రసంగంతో..

తెలంగాణ రాష్ట్రంలో వార్షిక బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం శాసనసభతో పాటు.. శాసనమండలి సమావేశంకానుంది. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగిస్తారు. అనంతరం బడ్జెట్ సమావేశాల ఎజెండా ఖరారవుతుంది. 
 
2021-22 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును ఆమోదించేందుకు శాసనసభ, మండలి కొలువుదీరనున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు రెండు సభలు సమావేశమవుతాయి. సంప్రదాయం ప్రకారం గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసెంబ్లీ సమావేశ మందిరంలో ప్రసంగిస్తారు. 
 
తొలిరోజు సభ కేవలం గవర్నర్ ప్రసంగానికి మాత్రమే పరిమితమవుతుంది. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల ఎజెండాను ఖరారు చేస్తారు. ఈ సమావేశాలు 12 రోజుల పాటు జరుగనున్నాయి. ముందుగా ఇటీవల మరణించిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు దివంగత నోముల నర్సింహయ్యకు ఈ నెల 16న శాసనసభ సంతాపం తెలపనుంది. 
 
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ నెల 17న చర్చ, ప్రభుత్వ సమాధానం ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత 18వ తేదీన 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్​ను ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఏసీ సమావేశంలో ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత బడ్జెట్​పై సాధారణ చర్చ, పద్దులపై చర్చతో పాటు ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ, ఆమోదంతో పాటు ఇతర అంశాలపై ఉభయసభల్లో చర్చ ఉంటుంది. 
 
కరోనా మహమ్మారి నేపథ్యంలో కొవిడ్​ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించాలని ఇప్పటికే నిర్ణయించారు. అందరూ మాస్కులు విధిగా ధరించాల్సి ఉంటుంది. కొవిడ్ పరీక్షలు తప్పనిసరి సభ్యులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కొవిడ్​ పరీక్షలు తప్పనిసరి చేశారు. సభలోపల, ప్రాంగణంలో రోజుకు రెండు మార్లు శానిటైజేషన్ చేయాలని నిర్ణయించారు. సభలోకి సందర్శకులను కూడా అనుమతించరు.