1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2019 (15:09 IST)

యాదాద్రిలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ - సీఎం వెంట చిన్నజీయర్ స్వామి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను కేసీఆర్‌ పరిశీలిస్తారు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి నిర్మాణాలన్నింటినీ పూర్తి చేయించడంతోపాటు మహాకుంభాభిషేకంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. 
 
ఆలయ నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేయడం సహా, యాగ నిర్వహణ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. అధికారులు, ఆలయ సిబ్బందితో సమాలోచనలు జరిపి సమీక్ష నిర్వహించే అవకాశముంది.
ప్రధాన ఆలయ నిర్మాణాలతో పాటు, టెంపుల్‌ సిటీ, యాగ స్థాలాన్ని సీఎం పరిశీలించనున్నారు. ప్రధాన ఆలయ నిర్మాణాలను పూర్తి చేసి, వచ్చే బ్రహ్మోత్సవాలనాటికి ఆలయ ప్రారంభోత్సవంలో భాగంగా మహాకుంభాభిషేకం నిర్వహించాలన్న యోచనలో సీఎం పర్యటన సాగుతోంది. 
 
ఆలయ నగరిలో కాటేజీల నిర్మాణాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. గుట్ట దిగువన గండిచెరువు సమీపంలో యాగాన్ని నిర్వహించే అవకాశముంది. ఆ స్థాలాన్ని సీఎం పరిశీలించిన తర్వాత వేదిక నిర్ణయం కానుంది. గత ఆగస్టులో యాదాద్రిలో పర్యటించిన కేసీఆర్‌.. 5 గంటల పాటు ఏకధాటిగా సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన తర్వాత నిర్మాణపనుల్లో వేగం పెరిగింది. ఇప్పుడు మరోసారి కేసీఆర్‌ రావడంతో వచ్చే రెండు నెలల్లో చేపట్టబోయే కార్యక్రమాలు త్వరిత గతిన పూర్తయ్యే అవకాశముంది.
 
ప్రధానంగా ఫోకస్ దేనిపైనంటే.. 
తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా, అంతర్జాతీయ ఖ్యాతిని గడించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టిన నాటి నుండి నేటి వరకు 11 సార్లు యాదాద్రి ఆలయాన్ని సందర్శించి పనులను పర్యవేక్షించిన సీఎం కేసీఆర్ నేడు 12వ సారి యాదాద్రి ఆలయ పనుల పరిశీలనకు వచ్చారు. 
 
యాదాద్రి ఆలయ నిర్మాణపనుల పురోగతినిపరిశీలించారు. అలాగే ప్రెసిడెన్షియల్ సూట్, ఇతర కాటేజ్ నిర్మాణాలను పరిశీలించి మహా సుదర్శనయాగం జరిగే ప్రాంతాన్ని సందర్శించారు. నిర్మాణ పనులపై అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. యాదాద్రిలో బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కొత్తగా నిర్మించిన ఆలయాన్ని, అభివృద్ధి పనులను పరిశీలించారు. 
 
ఇటీవల ఆలయ నిర్మాణం విషయంలో, మూలవిరాట్ ను మళ్లీ చెక్కారు అని విమర్శలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం వాటిని సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఇలాంటి అంశాలపై కూడా సీఎం కేసీఆర్ అధికారులతో, ఆలయ అర్చకులతో చర్చించారు. ఇప్పటికే 95 శాతం ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలో ఆలయం ఎప్పుడు ప్రారంభించాలి అన్న ముహూర్తం నిర్ణయించిన తరువాత మహా సుదర్శన యాగం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
 
ఇక ఈ యాగానికి సంబంధించి వంద ఎకరాల భూమిలో 1018 కుండాలతో దేశ విదేశాల నుండి మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులను ఆహ్వానించి అత్యంత ఘనంగా మహా సుదర్శన యాగం నిర్వహించాలని నిర్ణయించారు. ఇక దీనికి అనువైన ప్రాంతంగా గండి చెరువు ప్రాంతాన్ని ఎంపిక చేసిన సీఎం కేసీఆర్ ఆ ప్రాంతాలను మహా సుదర్శన యాగం నిర్వహించడానికి ఆహ్వానించే అతిథులకు సంబంధించి వసతులను, రవాణా సౌకర్యాలను పరిశీలించనున్నారు.
 
చిన్నజీయర్ స్వామితో సంప్రదింపులు..  
అంతేకాదు ఆలయ ప్రారంభానికి ముహూర్తంపై చిన జీయర్‌స్వామితో సంప్రదింపులు జరపనున్నారు. అలాగే కొండచుట్టూ నిర్మాణంలో ఉన్న ఆరు లేన్ల రహదారి, నిర్వాసితుల పునరావాసం వంటి అంశాల్ని కూడా సీఎం కేసీఆర్ పరిగణనలోకి తీసుకొని తదితర అంశాల పైన కూడా అధికారులతో చర్చిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆలయ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ కే నారాయణరెడ్డి పరిశీలించారు.