శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2019 (15:00 IST)

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వివక్షా.. తెదేపా అసత్య ప్రచారం : మంత్రి కన్నబాబు

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులపై విపక్ష తెలుగుదేశం పార్టీ అబద్దాలను ప్రచారం చేస్తోందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తాను నిన్న కూడా సభలో ఇదే విషయాన్ని చెప్పానన్న మంత్రి.... తెలుగుదేశం పార్టీ ఒక అబద్దాల ప్యాక్టరీ నడుపుతోందన్నారు. ఆ ప్యాక్టరీలో రోజుకొక అబద్దం ప్రొడ్యూస్‌ చేసి జనాలమీదకి వదులుతారన్నారు. ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగులకు సంబంధించి ఇన్‌ఛార్జ్‌ మంత్రులకు అధికారం ఇచ్చారనేది అబద్దమని కొట్టి పారేశారు. వీళ్లదంతా కపట ప్రేమ, మాటల్లో ఏ మాత్రం నిజాయితీ ఉండదన్నారు. 
 
ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ని, కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ని రోడ్డు మీదకి వదిలేసింది ఎవరని ప్రశ్నించారు. అసలు ఈ  అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎందుకు తీసుకురావాలనుకున్నారోనన్న విషయాన్ని సభ సాక్షిగా వివరించారు. గతంలో ప్రభుత్వం తరపున ఒక దళారీని పెట్టి ఆ దళారీకి ఎంప్లాయిస్‌ని పెట్టుకునే అవకాశం ఇచ్చి, ప్రభుత్వం పదివేలో, ఇరవై వేలో ఇస్తుంటే వాడు(ఈ దళారి) ఎంప్లాయికి ఐదువేలో, ఆరు వేలో ఇచ్చి పనిచేయించుకునే కార్యక్రమం చేశారని గుర్తు చేశారు. 
 
ఈ కార్యక్రమంలో ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు, చివరకు ఈపీఎఫ్, పీఎఫ్‌ కూడా లేదన్నారు. ఆ ఉద్యోగులకు ఎలాంటి సౌకర్యాలు లేని పరిస్థితి నడుస్తూ ఉన్నప్పుడు ఆ నియామకాలను కూడా వీళ్లు అవినీతికి, అక్రమాలకు తెరతీసి, వాళ్లకు ఇష్టమొచ్చిన వాళ్లను డబ్బులు తీసుకుని ఉద్యోగాలు వేసుకునే కార్యక్రమం తెలుగుదేశం పార్టీలో జరిగిందన్నారు.

ఇదే విషయం పాదయాత్రలో జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి వచ్చినప్పుడు వీటిని సరిచేయాలని నిర్ణయం తీసుకుని ఇవాళ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌కి సంబంధించి, కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌కి సంబంధించి ఒక విధానాన్ని తీసుకురావడానికి ప్లాన్‌ చేశారని చెప్పారు. దాని ఫలితమే ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్ సోర్సింగ్‌ ఏజెన్సీస్‌ ఏర్పాటని సభలో సమాధానమిచ్చారు.