శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2019 (15:35 IST)

మహిళలకు అభయాంధ్రప్రదేశ్‌ అనటానికే దిశ బిల్లు : హోం మంత్రి సుచరిత

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చారిత్రత్మక ‘దిశ’ బిల్లును హోంమంత్రి మేకతోటి సుచరిత శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు భద్రత కోసం బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ధన్యవాదాలను సుచరిత తెలిపారు. 
 
మహిళ రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం దిశ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా దళిత మహిళను హోంమంత్రి, గిరిజన మహిళను ఉపముఖ్యమంత్రిని అనేకమంది మహిళలను ఎమ్మెల్యేలు అయ్యే అవకాశాలను సీఎం కల్పించారన్నారు. రాష్ట్రంలో అనేక మంది మహిళలకు నామినేటెడ్‌ పోస్టు్ల్లో, నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం అవకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని సుచరిత తెలిపారు. 
 
ఇటీవలి కాలంలో మహిళలపై దాడులు పెరిగాయని.. ఢిల్లీలో నిర్భయ, జమ్ముకాశ్మీర్‌లో కతువా, హైదరాబాద్‌లో దిశ ఘటనతో దేశవ్యాప్తంగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారని ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారని సుచరిత అన్నారు. అర్థరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినట్లైతే దేశానికి స్వతంత్ర్యం వచ్చినట్లు అని మహాత్మాగాంధీ అన్నారు. కానీ పట్టపగలు మహిళ స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. 
 
దిశ ఘటన విని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చలించిపోయారని సుచరిత తెలిపారు. మహిళల రక్షణ కోసమే ప్రత్యేకంగా చట్టాలు తేవాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిశ చట్టాన్ని తీసుకొచ్చారని వెల్లడించారు. ఏపీలో మహిళలు అందరికీ జగన్ అన్న ఒక రక్ష అని వారిపై చేయి వేస్తే పడుతుంది కఠిన శిక్ష అని ముఖ్యమంత్రి గారు ఈ చట్టాన్ని తెచ్చారని హోంమంత్రి తెలిపారు. 
 
ఈ చట్టం వల్ల నేరం జరిగితే నాలుగు నెలలు పాటు విచారణ జరపకుండా శిక్షలు పడకుండా ఉన్నాయి.నేరం చేసిన వారు నిర్భయంగా సమాజంలో తిరుగుతున్నారు. నేరం చేసిన వారిని 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్షపడేలా ప్రత్యేక చట్టాన్ని తేవటమే కాకుండా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు ద్వారా మహిళలపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 
 
చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు మహిళలు అభద్రతా భావంతో ఉన్నారు. ఏ నేరాలు చేసినా ఏరకమైన శిక్ష లేకుండా తప్పించుకోవచ్చు అని నిర్భయంగా తిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. మన రాష్ట్రంలో ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువచ్చి మహిళలు అందరికీ భద్రత కల్పించాలని అనుకోవటంపై ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలను హోంమంత్రి సుచరిత తెలిపారు.
 
సోషల్‌ మీడియాలో, ఫోన్‌ద్వారా మహిళల్ని కించపరిస్తే 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా ఇచ్చేలా 354 (ఇ) సెక్షన్‌ తెస్తున్నామని అన్నారు. మళ్లీ ఇదే తప్పును రెండోసారి చేస్తే నాలుగేళ్ల జైలు శిక్ష పడుతుందని అన్నారు.  354 (ఎఫ్‌) సెక్షన్‌ బాలికలు, బాలలు కానీ ఎవరైనా పిల్లలపై లైంగిక నేరాలకు 10 నుంచి 14 ఏళ్ల వరకూ గరిష్టంగా శిక్ష పడుతుంది.

354 (జీ) సెక్షన్‌ ద్వారా పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులు, జైలుశిక్షపడిన మహిళా ఖైదీలపై పోలీసులు అత్యాచారం చేస్తే కఠినమైన శిక్షలు విధించేలా చట్టాన్ని తెచ్చామని సుచరిత అన్నారు. మహిళల పట్ల అభయాంధ్రప్రదేశ్‌లో ఉందని నిరూపించేందుకు చట్టాలు తీసుకురావటం జరిగిందని హోంమంత్రి సుచరిత తెలిపారు.