శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2019 (14:40 IST)

ఏపీ దిశ చట్టం - ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చట్టాల్లోని ముఖ్యాంశాలు

* కేంద్ర ప్రభుత్వం చట్టంప్రకారం, నిర్భయ కేసుల్లో జైలు లేదా మరణదండనను శిక్షగా విధిస్తుంటే... రాష్ట్రం ప్రవేశపెట్టిన చట్టం ద్వారా రేప్‌ చేసినవారికి తప్పనిసరిగా మరణదండన అమలు చేసేలా ఉంది. 
 
* నిర్భయం చట్టం ప్రకారం- 2 నెలల్లో దర్యాప్తు పూర్తయితే, మరో 2 నెలల్లో శిక్షలు పడాలి. అంటే మొత్తం 4 నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ ఈ రెండూ పూర్తికావాలి. 

* దీన్ని ఏపీ దిశ చట్టంలో 4 నెలలకు కాదు 21 రోజులకు కుదిస్తున్నాం. అత్యాచార నేరాల్లో విస్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభించినట్టియితే 21 రోజుల్లోపే నిందితుడికి శిక్ష పడాలి. వారంరోజుల్లో పోలీసు దర్యాప్తు పూర్తికావాలి. 14 రోజుల్లోపే న్యాయప్రక్రియ పూర్తిచేసి శిక్ష పడాలి. 
 
* అత్యాచార సంఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలన్నింటికీ కూడా శిక్షల్ని పెంచుతున్నాం. కేంద్రం చేసిన ‘‘పోక్సో’’ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు కనసీం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకూ శిక్ష విధించవచ్చు. మన రాష్ట్రంలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. అంటే పిల్లలపై ఇక ఎలాంటి లైంగిక నేరాలు చేసినా జీవితాంతం జైల్లో ఉండటమో, లేక ఉరికంబం ఎక్కడమో శిక్ష అవుతుంది.
 
* అత్యాచార నేరాలకు మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారి విషయంలో కేంద్రం విధించిన ఒక ఏడాది గడువుకు బదులు... దర్యాప్తు 7 రోజుల్లో చేసి, న్యాయ ప్రక్రియ 14 పనిదినాల్లో పూర్తిచేసేలా చట్టానికి సవరణ తీసుకు వచ్చారు. 
 
* సోషల్‌ మీడియా ద్వారా మహిళలను వేధించడం, వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం లాంటివి చేస్తే ఐపీసీ ప్రకారం ఇప్పటివరకూ శిక్షలు నిర్దిష్టంగా లేవు. 
 
ఈ చట్టం ద్వారా - మెయిల్స్‌ ద్వారా గాని, సోషల్‌ మీడియాద్వారా గాని, డిజిటల్‌ విధానంలోగాని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టయితే మొదటి తప్పుకు 2 ఏళ్లు, ఆ తర్వాత తప్పుకు 4 ఏళ్లు శిక్ష విధించేలా ఐపీసీలో 354 (ఇ) అనే కొత్త సెక్షన్‌ను తీసుకు వచ్చారు. 
 
* ఇంతవరకూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ మహిళలపై, పిల్లలపై నేరాల సత్వర విచారణకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టు లేనేలేవు. కొద్దిరాష్ట్రాల్లో మాత్రం ఈ నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఉన్నాయని కాని, జిల్లాకు ఒకటి ఎక్కడా లేదు.  
 
* దేశ చరిత్రలోనే తొలిసారిగా మహిళలు, పిల్లలపై నేరాల విచారణకు అదికూడా వేగంగా విచారణ ముగించడానికి వీలుగా ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నారు. ఈ కోర్టుల్లో అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, సోషల్‌మీడియా ద్వారా అసభ్యంగా చూపించడం, వేధించడం వంటి నేరాలు, పోక్సో పరిధిలోకి వచ్చే అన్ని నేరాలు ఈ కోర్టు పరిధిలోకి తీసుకువచ్చారు. 
 
* ఇక ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువును కూడా కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న 6 నెలల కాలాన్ని, మన రాష్ట్రం పరిధిలో కేవలం 3 నెలలకు తగ్గించారు.
 
* మహిళలు, పిల్లలపై నేరాల సత్వర విచారణ, శిక్షల విధింపు కోసం ప్రత్యేక పోలీసు బృందాల్ని, ప్రత్యేక పబ్లిక్‌ప్రాసిక్యూటర్లని, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర చట్టాల్లో ఇప్పటివరకూ ఎటువంటి ఏర్పాట్లు లేవు. 
 
* అయితే జిల్లా స్థాయిల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్‌ స్పెషల్‌ పోలీస్‌ టీమ్స్‌ను ఇందుకోసం ఏర్పాటు చేసేందుకు ఈచట్టంద్వారా వీలు కల్పించారు. 
అలాగే ప్రతి ప్రత్యేక కోర్టుకు, ప్రత్యేకంగా పబ్లిక్‌ప్రాసిక్యూటర్లని నియమించుకునే అవకాశాన్ని ఇస్తూ ఈ చట్టాన్ని చేశారు. 
 
* మహిళలు, పిల్లలపై నేరాలను నమోదుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్‌ రిజిస్ట్రీని పెట్టింది. అయితే ఆ రిజిస్ట్రీ ద్వారా డిజిటల్‌ పద్దతిలో డేటా బేస్‌ ఉంచి, జరిగిన నేరాలు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు వంటి వివరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు. అంటే, ఏ నేరగాడు, ఏ నేరం చేశాడన్న వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. 
 
* కాని, అటువంటి డిజిటిల్‌ రిజిస్ట్రీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా ఈ నేరాలకు సంబంధించిన వివరాలు అన్నింటినీ ప్రజలందరికీ అందుబాటులోకి ఉంచడంద్వారా అఫెండర్ల వివరాలు బహిర్గతం చేయబోతున్నారు. చట్టం ముందే కాకుండా సమాజం ముందు వారిని నిలబెడతారు.