1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana Government to plan Run Ouw Meat Shops

తెలంగాణాలో ప్రభుత్వ పరిధిలోకి మటన్ షాపులు

Telangana
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మటన్ షాపులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చే విషయంపై ముమ్మర కసరత్తు చేస్తోంది. వినియోగదారునికి సరసమైన ధరల్లో పరిశుద్ధమైన మాంసం అందించడం లక్ష్యంగా పశుసంవర్ధకశాఖ చర్యలు తీసుకుంటుంది.  
 
ఇందులో భాగంగానే మొదటగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కబేళాలు లేదా మేకల వధశాలలు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో ఒకటి లేదా రెండు, జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతీ జోన్‌లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. 
 
వీటిని అక్కడ స్థానికంగా ఉండే మటన్ షాపులకు లింక్ చేయనున్నారు. అక్కడి నుంచే మాంసం సరఫరా చేస్తారు. దుకాణదారులు ప్రభుత్వం అందించిన మాంసాన్నే విక్రయించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వినియోగదారులకు శుద్ధమైన మాంసం అందడంతోపాటు, తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 
 
ముఖ్యంగా, మాంసం దుకాణాల్లో శుభ్రత పాటించేలా నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. మాంసం శుద్ధిగా ఉండేలా దుకాణాల్లో రిఫ్రిజిరేటర్‌ను కూడా అందుబాటులో ఉంచుతారు. దుకాణాల ఆధునీకరణకు అవసరమైతే బ్యాంకుల నుంచి రుణం కూడా ఇప్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
 
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 10 వేల దాకా మటన్‌ షాపులు ఉండగా.. రెండువేల దుకాణాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ షాపులన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తేవాలని భావిస్తున్నారు. అయితే, ఇది ఆచరణలో ఎంత మేరకు సాధ్యమవుతుందో వేచిచూడాల్సిందే.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నేడు ఎంపీపీ - వైస్ ఎంపీపీ పదవులకు ఎన్నికలు