మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 మార్చి 2023 (11:47 IST)

ఆర్టీసీ కార్గో సిబ్బంది చేతివాటం : 51 కేజీల జామకాయలకు గాను... 21 కేజీలే చేరాయి..

cargo service
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ కార్గో సేవలను ప్రారంభించింది. వీటికి మంచి ఆదరణ లభిస్తుంది. అదేసమయంలో కార్గో సిబ్బందిలో కొందరు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనికి తాజా ఘటనే నిదర్శనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన ఓ రైతు 51 కేజీల జామకాయల బుట్టను పంపిస్తే అది హైదరాబాద్ నగరానికి చేరుకునే సమయానికి 27 కేజీలు తూగింది. దీనిపై హైదరాబాద్ కార్గో సిబ్బందిని ప్రశ్నిస్తే తమకు తెలియదు.. ఇల్లెందులో అడగాలని సూచించారు. ఇల్లెందులో అడిగితే హైదరాబాద్ కార్గో సిబ్బందిని అడగాలంటూ అడ్డదిడ్డంగా సమాధానం చెప్పారు. దీంతో ఆ యజమాని చేసేదేం లేక ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. 
 
ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు ఇల్లెందు బస్టాండులో 51 కేజీల బరువుతో ఉండే బుట్టను ఆర్టీసీ కార్గోలో హైదరాబాద్ నగరానికి పంపించారు. మరుసటి రోజు హైదరాబాద్ నగరానికి చేరాల్సిన ఆ బుట్ట ఒక రోజు ఆలస్యంగా చేరింది. అంటే ఈ నెల 20వ తేదీన వచ్చింది. ఉప్పల్ ప్రాంతానికి చెందిదన అనిల్ అనే యువకుడు ఈ పార్శిల్‌ను తీసుకున్నాడు. అయితే బుట్ట బరువు తక్కువగా ఉండటంతో అక్కడే తూకం వేయించగా, 51 కేజీల బరువు ఉండాల్సిన జామకాయలు 27 కేజీలు మాత్రమే ఉన్నట్టు చూపించింది.
 
దీనిపై ఆయన కార్గో సిబ్బందిని నిలదీయగా వారు తమకేం తెలియదని చెప్పారు. దీంతో ఆయన ఆర్టీసీ కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. దీనిపై ఆర్టీసీ కార్గో బిజినెస్ హెడ్ సంతోష్ మీడియాతో మాట్లాడుతూ, పార్శిల్ విషయంలో ఫిర్యాదు అందిందని, విచారించి ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుంటామని చెప్పారు.