శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 మార్చి 2023 (11:28 IST)

టీపీఎస్‍సీ పరీక్ష పేపర్ లీక్‌ కొత్త ట్విస్ట్ : మరో పదిమందికి ఉద్యోగులకు లింకు!

tspsc
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలు లీకేజీ కేసులో సరికొత్త ట్విస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రవీణ్‌తో పాటు మరో పది మంది ఉద్యోగులు గ్రూపు 1 పరీక్ష రాసినట్టు సిట్ అధికారులు తమ దర్యాప్తులో కనుగొన్నారు. అంతేకాకుండా, ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిపైన కూడా సిట్ అధికారులు కోరుతున్నారు. 
 
ఈ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారి ప్రవీణ్‌తో పాటు సంస్థలో పనిచేస్తున్న మరో పది మంది ఉద్యోగులు కూడా గ్రూపు-1 ప్రిలిమ్స్ రాసినట్టు సిట్ విచారణలో బయటపడింది. ఇందులో ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు కాగా, ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఈ పది మంది కూడా గ్రూపు-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై కావడం గమనార్హం. అయితే, గ్రూపు-1 రాయడానికి వీరు కమిషన్ అధికారుల అనుమతి తీసుకున్నారా లేదా అనేది ఇంకా తెలియాల్సివుంది. ఈ పరీక్ష రాయడానికి సెలవు పెట్టారా లేక ఉద్యోగం చేస్తూనే పరీక్షకు హాజరయ్యారా అనే విషయాలపై వారు ఆరా తీస్తున్నారు. 
 
కాగా, పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే తొమ్మిది మంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కస్టడీలో ఉన్న నిందితులను ప్రశ్శించే కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కమిషన్ ఉద్యోగులు గ్రూపు-1 పరీక్ష రాయడం, వారిలో ఏకంగా పది మంది మెయిన్స్‌కు అర్హత సాధించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.