గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (09:28 IST)

ఆస్తి పంపకాలు చేయలేదని తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచారు

ఆస్తి పంచలేదన్న అక్కసుతో మారుతల్లి శవాన్ని రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉంచిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలోని మారుమూల గిరిజన గ్రామమైన పెద్ద బంగారు జాల గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన తాటి సమ్మయ్య అనే వ్యక్తికి తొలుత బుచ్చెమ్మ అనే మహిళతో పెళ్లయింది. వీరికి  ముగ్గురు కుమారులు. ఒక కుమార్తె. బుచ్చెమ్మ చనిపోవడంతో రత్తమ్మ (75) అనే మహిళను సమ్మయ్య వివాహం చేసుకున్నాడు. వారికి పిల్లలు కలుగలేదు. కానీ ఓ పిల్లోడిని పెంచుకున్నారు. అతని పేరు రవికుమార్. 
 
ఈ క్రమంలో సమ్మయ్య బతికి ఉన్న కాలంలో తన ఎకరా భూమిని రత్తమ్మ పెంచుకున్న రవికుమార్‌కు సమ్మయ్య రాసిచ్చాడు. కొన్నేళ్ల తర్వాత తాటి సమ్మయ్య మృతిచెందాడు. ఈనెల 9న రత్తమ్మ కూడా అనారోగ్యంతో మృతిచెందింది. దహన సంస్కారాలు చేయడానికి సమ్మయ్య మొదటి భార్య కుమారులను అడగ్గా తమకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తెగేసి చెప్పారు. 
 
అంతేకాకుండా తమ తండ్రి రవికుమార్‌కు రాసిన భూమి కూడా ఇవ్వమని భీష్మించుకుని కూర్చున్నారు. కుమారులు దహన సంస్కారాలు చేయాలని కుల పెద్దలు నిర్ణయించగా ముగ్గురు కుమారులు అందుకు తిరస్కరించారు. రెండు రోజులు దాటినా పట్టించుకోకపోవడంతో సోమవారం సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి గ్రామస్తుల సహకారంతో వారి కుమారులకు నచ్చ చెప్పి మృతురాలికి దహన సంస్కారాలు చేశారు.