శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (09:20 IST)

ఊడిగం చేసే జగన్‌కు ఓటు వేస్తే మోడీకి వేసినట్టే : చంద్రబాబు

కేంద్రానికి ఊడిగం చేసే వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేస్తే అది ప్రధాని నరేంద్ర మోడీకి ఓటు వేసినట్టేనని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సార్వత్రిక ఎన్నికలపై ఆయన చేసిన వరుస ట్వీట్లు ఇవే... 
 
* టీడీపీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. ఐదేళ్లు సమర్ధవంతంగా పనిచేసి ప్రతిఒక్కరికి సంక్షేమ ఫలితాల్ని అందించాం. కష్టకాలం, అందులోనూ తక్కువ సమయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది.
 
* నాకు ఒక్క రిటర్న్‌ గిఫ్ట్‌ ఇప్పిస్తే.. మీకు 100 గిఫ్ట్‌లు ఇప్పిస్తా. ఊడిగం చేసే జగన్‌కు ఓటు వేస్తే అది కేసీఆర్‌కు, మోడీకి వేసినట్లే. ఏపీలో జగన్ ఒక్క సీటు గెలిచినా ఆ సీటుతో కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి మనల్ని అమ్మేస్తారు.
 
* ఈ ఎన్నికలు నవ్యాంధ్ర ఆత్మగౌరవానికి పరీక్షలాంటివి. నేను ఐదేళ్లు కష్టపడి చదువుకున్నాను. నన్ను పాస్ చేయాల్సింది మీరే. ఇది రాష్ట్ర ప్రజలందరికీ పరీక్షా సమయం. ఇవి వైసీపీ, కేసీఆర్‌ వచ్చి పెట్టే ఎన్నికలు కాదు. ఇది మీ భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నికలు.
 
* పరీక్షలు రాసే విద్యార్థి సిలబస్ అంతా కష్టపడి చదివినట్లు, గత ఐదేళ్లు రేయింబవళ్లు అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం, ముఖ్యంగా మహిళలు, రైతులు, వెనుకబడ్డ వర్గాలు, దళితులకు మెరుగైన జీవితం అందించడానికి నా శాయశక్తులా శ్రమించాను. వారి జీవన ప్రమాణాల్లో గణనీయ ప్రగతి సాధించాం. 
 
* కష్టపడిన విద్యార్థికి మంచి ర్యాంకు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, మరింత కష్టపడి ఎలా చదువుతాడో, అలాగే 5 ఏళ్ళు కష్టపడి మీ కోసం, మీ బిడ్డల కోసం, వారి బిడ్డల కోసం నవ్యాంధ్రప్రదేశ్‌ను బలమైన పునాదులతో నిర్మించే బాధ్యతను నిర్వహిస్తున్నాను.
 
* 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలలో గెలిపించి, మరింత ఉత్సాహంతో మీ ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేసేలా నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. మీ భవిష్యత్తు నా బాధ్యత.