1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (07:56 IST)

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలు : కె.కవితతో సహా ముగ్గురు ఏకగ్రీవం

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, మొత్తం 99 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. వీరిలో తెరాస అధినేత, సీఎం కేసీఆర్ కుమార్తె కె.కవిత, పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజులు ఉన్నారు. 
 
కాగా, మొత్తం 12 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 99 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, వీటిలో 73 మాత్రమే సంక్రమంగా ఉన్నాయి. మరో ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 24 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ 12 ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే నెల 10వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. 
 
ఇదిలావుంటే, సీఎం కేసీఆర్ కుమార్తె కె.కవిత నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఇది రెండోసారి. గతంలో ఆమె నిజామాబాద్ ఎంపీగా పని ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఆమెను చిత్తుగా ఓడించి, బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. దీంతో సీఎం కేసీఆర్ ఆమెను శాసనమండలికి పంపారు. ఇపుడు రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
 
అలాగే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు తెరాస నేతలు పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజులతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే, గడువు దాటిన తర్వాత నామినేషన్ పత్రాలు సమర్పించడం, డిపాజిటి నగదు చెల్లించకపోవడం, నామినేషన్‌ను ప్రతిపాదించే వారు లేకపోవడంతో చంద్రశేఖర్ నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. దీంతో వీరిద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు.