1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (14:40 IST)

భుజం ఎముకకు ఫ్రాక్చర్ అయింది.. అందుకే సెలవులో ఉన్నా : డీజీపీ మహేందర్ రెడ్డి

తన గురించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఖండించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తమన్నారు. తనను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందంటూ రేవంత్ చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. 
 
ఇటీవల తాను ఇంట్లో జారిపడ్డానని, దీంతో భుజానికి గాయమైందన్నారు. ఈ కారణంగా మూడు చోట్ల ఫ్రాక్చర్ అయినట్టు ఎక్స్‌రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ రిపోర్టుల్లో తేలిందన్నారు. దీంతో భుజం కదలకుండా కట్టుకట్టారని తెలిపారు. పైగా, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చూసించారని చెప్పారు. అందుకే ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు సెలవులో ఉన్నట్టు చెప్పారు. 
 
ఆ తర్వాత కూడా వైద్యుల సలహా మేరకే తాను విధుల్లో చేరేది లేనిది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం భుజానికి అవసరమైన వ్యాయామం, ఫిజియో థెరపీ చేయించుకుంటూ మందులను వాడుతున్నట్టు చెప్పారు. ఇలాంటి వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వం తనను బలవంతంగా సెలవుపై పంపించిందని చెప్పడాన్ని ఖండిస్తున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.