1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జులై 2022 (12:58 IST)

తెలంగాణాలో నేటి నుంచి ఎంసెట్ - నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

students
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం ప్రవేశ అర్హత పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో జరిగే ఈ పరీక్షలు ప్రతి రోజూ రెండు సెషన్స్‌లలో నిర్వహిస్తారు. ఉదయం 9 గంట నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. 
 
ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షలకు నియమ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. అలాగే,  పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని చెప్పారు. అందువల్ల విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
 
మొత్తం మూడు రోజుల పాటుసాగే ఈ పరీక్షలకు 1,72,241 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 108 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్థన్ తెలిపారు. ఇందులో తెలంగాణాలో 89, ఏపీలో 19 చొప్పున ఉన్నాయన్నారు. 
 
విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి హాల్ టికెట్, గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు తీసుకురావాలని చెప్పారు. మొబైల్ ఫోన్లు, వాచీలు, కాలిక్యులేటర్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. కాగా, ఈ నెల 14, 15వ తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ విభాగం అర్హత పరీక్షలు భారీ వర్షాల కారణంగా వాయిదా వేసిన విషయం తెల్సిందే.