1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జులై 2022 (08:53 IST)

'క్లౌడ్ బరస్ట్‌' విదేశీ కుట్ర అయితే, ఆధారాలు కోరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

kishan reddy
తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా కురిసిన భారీ వర్షాలు విదేశీ కుట్ర అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా వర్షాలు క్లౌడ్ బరస్ట్ కుట్ర అయితే, దానికి సంబంధించిన ఆధారాలు ఇస్తే కేంద్రం దర్యాప్తు చేయిస్తుందని ఆయన తెలిపారు. 
 
ప్రకృతిపరంగా వచ్చిన వర్షాలను కూడా కుట్ర కోణంలో చేసిన సీఎం చేసిన ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణ, ఏపీలలో ఇటీవల గోదావరి వరదలు, లడఖ్, ఉత్తరాఖండ్ వరదలకు కారణమైన క్లౌడ్ బరస్ట్‌లపై విదేశీ కుట్ర విషయంలో సంచలన ఆరోపణలు చేసిన సీఎం కేసీఆర్ అందుకు సరైన ఆధారాలు సమర్పిస్తే కేంద్రం సీరియస్‌గానే విచారణ చేయిస్తామని కిషన్ రెడ్డి ట్వీట్స్ చేశారు.
 
ఆదివారం భద్రాచలం వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ వర్షాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. దేశంలో పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ సృష్టిస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. ఇతర దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారని అన్నారు. గతంలో లద్దాఖ్, లేహ్, ఉత్తరాఖండ్‌లో ఇలాగే జరిగిందని చెప్పారు. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంపై కూడా కుట్ర చేసినట్లు కేసీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.