1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 మార్చి 2022 (09:56 IST)

జీవితకాల స్ఫూర్తిని మిగిల్చి సెలవంటూ వెళ్లిపోయిన మల్లు స్వరాజ్యం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరోచిత పోరాటయోధురాలిగా గుర్తింపు పొందిన స్వాతంత్ర్య సమరయోధురాలు మల్లు స్వరాజ్యం ఇకలేరు. ఆమె యువతరానికి ఒక జీవితకాల స్ఫూర్తిని మిగిల్చి ఇక సెలవు అంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 
 
సీపీఎం సీనియర్ మహిళా నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (91) మృతి చెందారు. హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందతూ ఆమె తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో పాటు.. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆమె తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో తుది శ్వాసవిడిచారు. 
 
ఈ నెల 1వ తేదీన ఆస్పత్రిలో చేరిన మల్లు స్వరాజ్యం... కొద్ది రోజుల చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో ఐసీయు నుంచి సాధారణ గదికి మార్చారు. అయితే, శుక్రవారం మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయుకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచారు. కానీ, శుక్రవారం శనివారం రాత్రి 7.35 గంటల సమయంలో ఆమె చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. 
 
ఈమె ప్రస్తుతం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెంలో గత 1931లో జన్మించారు. తల్లిదండ్రులు చొక్కమ్మ, రామిరెడ్డి. 500 ఎకరాల భూస్వామి కుటుంబంలో జన్మించిన మల్లు స్వరాజ్యం మాక్సిం గోర్కి రచించిన అమ్మ నవల ప్రేరరణతో సామాజిక దురాచారాలపై ఉద్యమించారు.