1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (07:21 IST)

పెట్రోల్ బాదుడు తప్పదా : లీటరుకు రూ.15 వరకు పెంపు?

దేశంలో పెట్రోల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోనున్నాయి. ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా, యుద్ధానికి ముందు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లుగా ఉంటే అదే ధర ఇపుడు 130 డాలర్లకు చేరుకుంది. ఫలితంగా ఇంధనం కోసం దిగుమతులపై ఆధారపడే చాలా దేశాల్లో పెట్రోల్, డీజల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. అలాంటి దేశాల్లో భారత్ ఒకటి. 
 
దేశంలో ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఆ తర్వాత ఈ పెట్రో ధరలను పెంచేందుకు చమురు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పెట్రోల్ ధరలు పెంచితే తీవ్ర ప్రభావం చూపుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా వీటి జోలికి వెళ్లలేదు. 
 
ఇపుడు ఈ ధరలను పెంచేందుకు పచ్చజెండా ఊపించింది. దీంతో పెట్రోల్ బాంబు ఏ క్షణమైనా పేలే అవకాశం ఉంది. ఈ బాదుడు కూడా లీటరుకు రూ.15, డీజల్‌ ధరపై రూ.20 వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, కేంద్రం కాస్తయినా కనికరించి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే మాత్రం ఈ పెట్రోల్ ధర ప్రజలపై కొంతైనా భారం తగ్గుతుంది.