1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (08:50 IST)

వచ్చేవారం నుంచి పెట్రో బాదుడు... లీటర్ ధర రూ.120 !!

దేశంలో పెట్రోల్, డీజల్ ధరల బాదుడుకు తెరెతీయనున్నారు. వచ్చేవారం నుంచి ఇంధన ధరలను పెంచేందుకు ప్రభుత్వ చమురు సంస్థలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రోజువారీ వడ్డనకు తాత్కాలికంగా స్వస్తి చెప్పారు. అయితే, ఈ ఎన్నికల్లో భాగంగా యూపీలో చివరి దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 7వ తేదీన జరుగనుంది. ఆ మరుసటి రోజు నుంచే ఆయిల్ కంపెనీలు పెట్రోల్ వడ్డనకు శ్రీకారం చుట్టనున్నాయి.  
 
ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 111 డాలర్లకు చేరింది. ఈ భారం రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మరింతగా పెరగనుంది. దేశంలో పెట్రోల్ రిటైర్ల ధరల సవరణ స్తంభించినపుడు ముడిచమురు ధర 81.5 డాలర్లుగా ఉంది. అంటే ప్రస్తుతం దీని ధర 28.5 డాలర్లు అధికంగా పెరిగింది. 
 
దీంతో చమురు మార్కెటింగ్ సంస్థలపై మరింత భారం పడింది. ఇపుడు ఈ భారాన్ని చమురు వినయోగదారులపై మోపేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధమయ్యాయి. ఇందులోభాగంగా, పెట్రోల్ ధరను భారీ పెంచే అవకాశం ఉందని, ఈ కారణంగా లీటరు పెట్రోల్ ధర రూ.120కు చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.