సంబంధిత వార్తలు
- Sai durga Tej : పాతకాలపు రొటీన్ కథలను స్వస్తి చెప్పానంటున్న సాయి దుర్గా తేజ్
- అంతా బీఆర్ఎస్ వల్లే జరిగింది.. కిషన్ రెడ్డి అడ్డుకున్నారు.. రేవంతన్న ఫైర్
- నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. జూన్ 2 నుంచి 4 మధ్య కేరళలోకి...
- Period Delay Pills, ప్లీజ్ పీరియడ్స్ డిలే పిల్స్ వేసుకోకండి, ప్రాణం పోయింది, వీడియో
- Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి
అడిగి తీసుకుంటే భిక్ష - అడగకుండా ఇస్తే అసలైన విలువ : రాజేంద్ర ప్రసాద్
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంపై సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కరాన్ని ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన అందుకున్నారు.
దీనిపై ఆయన హైదరాబాద్ నగరంలో మాట్లాడుతూ, అడిగి తీసుకుంటే అది భిక్ష అవుతుందని, అడగకుండా ఇస్తేనే ఆ పురస్కారానికి అసలైన విలువ, గౌరవం ఉంటాయన్నారు. ఈ పురస్కారం తనకు ఆలస్యంగా లభించినప్పటికీ, దాని కోసం తాను ఎప్పుడూ పాకులాడలేదన్నారు.
విజయ చాముండేశ్వరి బ్యానర్పై 'మేడమ్', 'రాంబంటు' వంటి చిత్రాలను నిర్మించినప్పటి అనుభవాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 'రాంబంటు' సినిమా వల్ల వచ్చిన నష్టాల కారణంగా అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలోని తన అర ఎకరం భూమిని అమ్ముకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తన నిర్మాణంలో వచ్చిన ఒక చిత్రంలోని మహిళా పాత్రకు ప్రత్యేక జ్యూరీ అవార్డు దక్కడం వెనక అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహం ఎంతో ఉందని స్మరించుకున్నారు.
దక్షిణాది కళాకారులకు పురస్కారాలు ఆలస్యంగా వస్తున్నాయంటూ నటుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ ఆచితూచి స్పందించారు. 'చిరంజీవి ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారో నాకు తెలియదు. అయితే, ప్రతి విషయాన్ని ప్రతికూల కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు' అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఐదు తరాల నటీనటులతో కలిసి పనిచేయడం తన అదృష్టమని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటితరం దర్శకులు సైతం తన కోసం ప్రత్యేకంగా పాత్రలను సృష్టిస్తుండటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తాను నటించిన ఆంగ్ల చిత్రం 'క్విక్ గన్ మురుగన్'కు సీక్వెల్ తీసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దశాబ్దాలుగా ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పద్మశ్రీ పురస్కారం లభించింది.
తర్వాతి కథనం
